హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): నోటిఫికేషన్లు, పోటీ పరీక్షల నేపథ్యంలో అభ్యర్థులు సన్నద్ధమయ్యేందుకు రాష్ట్రంలోని 573 గ్రంథాలయాల్లో 440 రీడింగ్ రూంలను అందుబాటులో ఉంచినట్టు గ్రంథాలయ పరిషత్తు చైర్మన్ అయాచితం శ్రీధర్ వివరించారు. వీటిల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. మెటీరియల్ కొరత లేకుండా చూస్తున్నామని వెల్లడించారు. పోటీ పరీక్షల దృష్ట్యా గ్రంథాలయాల్లో ఏర్పాట్లపై ‘నమస్తే తెలంగాణ’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరించారు.
అందుబాటులో పుస్తకాలు
పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను పెద్ద ఎత్తున అందుబాటులో ఉంచుతున్నాం. స్టడీ మెటీరియల్ను సీడీలు, డీవీడీల రూపంలో సమకూర్చుతున్నాం. తొలి దశలో హైదరాబాద్ చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంలో రూ.20 లక్షలు వెచ్చించి సీడీలు, డీవీడీలను అందుబాటులో ఉంచాం. త్వరలోనే రాష్ట్రంలోని అన్ని గ్రంథాలయాల్లోను సీడీలు, డీవీడీలను సమకూరుస్తాం. ఇందుకోసం గ్రంథాలయ నిధుల్లో 10 శాతం వినియోగించుకొనే అవకాశమిచ్చాం. ఈ సీడీలు, డీవీడీలను పెన్డ్రైవ్లలో కాపీ చేసుకోవచ్చు. కంప్యూటర్లలో నిక్షిప్తం చేసుకోవచ్చు.
ఏ పుస్తకం కావాలన్నా సమకూరుస్తాం
ఉద్యోగార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు ఏ పుస్తకం కావాలన్నా సమకూరుస్తాం. ఇందుకోసం ‘ఆన్ డిమాండ్ బుక్ సిస్టం’ను అమలుచేస్తున్నాం. దీనికి గ్రంథాలయాల్లో రిజిస్టర్ను ఏర్పాటు చేశాం. అభ్యర్థులు తమకు కావాల్సిన పుస్తకం పేరును రిజిస్టర్లో రాస్తే వారంలో తెప్పించి ఇస్తున్నాం. ఈ పుస్తకాల కొనుగోలుకు గ్రంథాలయాలకే స్వేచ్ఛనిచ్చాం. ప్రతి గ్రంథాలయం గరిష్ఠంగా నెలకు రూ.20 వేల వరకు ఆన్ డిమాండ్ బుక్ సిస్టంలో పుస్తకాల కొనుగోలుకు వెచ్చించే అవకాశం ఇచ్చాం. పరిమితిని మరింత పెంచాలని ఆలోచిస్తున్నాం. గ్రూప్స్, టీచర్ ఉద్యోగాల పుస్తకాల కోసం అధిక డిమాండ్ ఉంటున్నది. పుస్తకాలు కొనడం నిరంతర ప్రక్రియ. నోటిఫికేషన్లు వెలువడగానే కొత్త పుస్తకాలను కొంటాం.
రూ.80 లక్షలతో కొత్త పుస్తకాలు
పోటీ పరీక్షల వాతావరణాన్ని గమనించి పెద్ద ఎత్తున పుస్తకాలు కొనుగోలు చేస్తున్నాం. నోటిఫికేషన్లు వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో జనవరి నుంచే అప్రమత్తమయ్యాం. అప్పటి నుంచి రూ.80 లక్షలు వెచ్చించి కొత్త పుస్తకాలు కొనుగోలుచేసి, గ్రంథాలయాలకు సరఫరాచేశాం. తెలుగు అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ, ఎన్బీటీ, ఎన్సీఈఆర్టీ, ఎస్సీఈఆర్టీ, తెలుగు విశ్వవిద్యాలయం వంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు ముద్రించిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నాం.
అభ్యర్థులకు ఉచిత శిక్షణ
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వారికి నోటిఫికేషన్లు వచ్చిన వెంటనే గ్రంథాలయాల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నాం. ఇలా 23 జిల్లా కేంద్ర గ్రంథాలయాల్లో ఉచిత శిక్షణకు ఏర్పాట్లు చేస్తున్నాం. ఎస్సీ, బీసీ స్టడీ సర్కిల్స్ సాయంతో ఈ శిక్షణను కొనసాగిస్తాం. జనరల్ స్టడీస్, జనరల్ నాలెడ్జ్, జీకే వంటి అంశాలపై ఉచిత శిక్షణనిస్తాం. పోటీ పరీక్షలు, సిలబస్పై అభ్యర్థులకు సమగ్ర అవగాహన కల్పించేందుకు త్వరలోనే సదస్సులు నిర్వహిస్తాం. విషయ నిపుణులు, కౌన్సిలర్స్తో ఆయా అంశాలపై అవగాహన కల్పిస్తాం. పోటీ పరీక్షల సిలబస్, సన్నద్ధత టిప్స్ వంటి వాటిని వివరిస్తాం.
టైమింగ్స్ పెంచుతాం
ఉద్యోగాల ప్రకటన నేపథ్యంలో గ్రంథాలయాలకు ఉద్యోగార్థుల తాకిడి పెరిగింది. ఈ క్రమంలో గ్రంథాలయాల నిర్వహణ సమయాన్ని పెంచాలనుకొంటున్నాం. ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు గ్రంథాలయాలను నిర్వహిస్తున్నాం. సెలవు రోజుల్లోనూ నడుపుతున్నాం. అవసరాన్ని బట్టి సమయాలను పొడిగిస్తాం.
రీడింగ్ రూంల వివరాలు..
సామర్థ్యం : రూంల సంఖ్య
25 -50 : 237
50-75 : 126
75 -100 : 31
100కు పైగా : 23
100 -200 : 23
మొత్తం : 440