హైదరాబాద్, మార్చి 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగుల పదవీ విరమణలు ఈ నెలాఖరు నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును గత కేసీఆర్ సర్కారు 58 ఏండ్ల నుంచి 61 ఏండ్లకు పెంచిన విషయం తెలిసిందే. ఆ జీవో గడువు ఈ నెల 31తో ముగియనున్నది. మూడేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ నెల నుంచే పదవీ విరమణల సీజన్ ప్రారంభంకానున్నది. అయితే పదవీ విరమణ తరువాత లభించే ఆర్థిక లబ్ధితో ప్రశాంతంగా గడపాలనుకుంటున్న ఉద్యోగుల కోరికలు నెరవేరాల కనిపించడం లేదు. ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ను నగదు రూపంలో కాకుండా బాండ్ల రూపంలో ఇవ్వాలని యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ ఒక్క ఏడాదిలో ఎనిమిది వేలమందికి పైగా ఉద్యోగులు పదవీ విమరణ పొందనున్నారు. వీరిలో ఒక్కో ఉద్యోగికి రూ. 35లక్షల నుంచి గరిష్ఠంగా రూ.కోటి వరకు చెల్లించాల్సి ఉంటుంది. దీంతో ఈ ఒక్క ఏడాదిలోనే రూ. 40వేల కోట్లకు పైగా ప్రభుత్వంపై భారం పడనుంది. అసలే ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిన రేవంత్ సర్కారు ఇప్పటికిప్పుడు రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించే అవకాశాలు లేవన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీపీఎఫ్, గ్రాట్యూటీ, పెన్షన్ వంటి వాటిని బాండ్ల రూపంలో ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలిసింది. ఇదే జరిగితే పదవీ విరమణ పొందిన వారంతా అటు వేతనాలు రాక, ఇటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తలెత్తనుంది.
ఐదేండ్లల్లో 44వేల మంది
ప్రభుత్వ వర్గాల కథనం ప్రకారం రాబోయే ఐదేండ్లలో 44వేల మంది ఉద్యోగులు పదవీ విరమణ పొందనున్నారు. ఇక నుంచి ఏడాదికి 8 నుంచి 10 వేల చొప్పున ఉద్యోగులు పదవీ విరమణ పొందుతారు. ప్రస్తుతం రాష్ట్రంలో 3,69,200 మంది ప్రభుత్వ ఉద్యోగులున్నారు. ఈ ఐదేండ్లలో 44వేల మంది వైదొలగడంతో ఉద్యోగుల సంఖ్య 3.25లక్షలకు చేరనుంది. ఇక పెన్షనర్ల సంఖ్య ప్రస్తుతం 2.88లక్షలుండగా, రాబోయే ఐదేండ్లల్లో 3.32లక్షలకు చేరనుంది. దీని ప్రభావం పాలనపైనా పడుతుందని నిపుణలు అంచనాలేస్తున్నారు.
ఏటా వేతన వ్యయం రూ.55 వేల కోట్లు
రాష్ట్ర ఖజానా నుంచి ఏటా రూ.55వేల కోట్ల వరకు (రెవెన్యూలో 35 శాతం) ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల భత్యం చెల్లింపులకే వెళ్తున్నాయి. వాస్తవానికి పీఆర్సీలు, ఫిట్మెంట్ల అమలుతో ఉద్యోగుల వేతనాలు, పెన్షనర్ల భత్యం భారీగా పెరిగాయి. 2014 నుంచి 23 వరకు ఈ చెల్లింపులు మూడురెట్లు పెరిగాయి. ఒక్క 2023 -24 ఆర్థిక సంవత్సరంలోనే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల చెల్లింపునకు రూ. 55,925 కోట్లు వెచ్చిస్తున్నారు. వీటిలో రెగ్యులర్ ఉద్యోగుల వేతనాలు రూ.40,109 కోట్లుండగా, పెన్షనర్లకు ఇచ్చేవి రూ.15,816 కోట్లున్నాయి. రాష్ట్రం ఏర్పాటైనప్పుడు 2014లో వేతనాలు, పెన్షనర్ల చెల్లింపులు కేవలం రూ. 17,130 కోట్లు మాత్రమే ఉండేది. 2021-22కు వచ్చేసరికి ఇది రూ.48,809 కోట్లకు, 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.55,925 కోట్లకు చేరుకుంది. పెన్షనర్ల భత్యం 2024లో రూ. 4,210 కోట్లుండగా, 2023కు వచ్చేసరికి రూ. 15వేల కోట్లకు చేరింది. తాజా పదవీ విరమణలతో పెన్షనర్ల భత్యం మరింతగా పెరిగే అవకాశముంది.
వచ్చే ఐదేండ్లలో పదవీ విరమణ పొందేవారు..