కరీంనగర్ : జిల్లాలో కరోనా కలకలం సృష్టించింది. నగర శివారులోని బొమ్మకల్లో ఉన్న చల్మెడ మెడికల్ కాలేజీలో 43 మంది వైద్య విద్యార్థులకు కరోనా పాజిటివ్గా తేలినట్లు కళాశాల యాజమాన్యం తెలిపింది. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జువేరియా సైతం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ప్రస్తుతం సిబ్బందితో పాటు మిగతా విద్యార్థులకు సైతం యాజమాన్యం పరీక్షలు నిర్వహిస్తున్నది. ప్రస్తుతం కళాశాలకు సెలవు ప్రకటించారు.
అయితే, ఇటీవల ఫ్రెష్సర్స్ను ఆహ్వానిస్తూ నిర్వహించిన ప్రిష్టా-2021 కార్యక్రమానికి హైదరాబాద్ నుంచి ఒక కల్చరల్ టీం వచ్చినట్లు తెలిసింది. వీరి ద్వారానే వైరస్ సోకి ఉంటుందని భావిస్తున్నారు. లేదంటే మెడికోల్లోనే ఎవరికైనా వైరస్ సోకడంతో మిగతా వారందరికీ సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు. మెడికల్ కాలేజీలో విద్యార్థులు కరోనా బారినపడడంతో స్థానికంగా కలవరానికి గురి చేసింది.