తెలుగు అకాడమీ పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి సబిత
గ్రంథాలయాల్లో వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశం
హైదరాబాద్, మే 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ 42 రకాల పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రూప్-1, ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ సహా పలు నోటిఫికేషన్లను దృష్టిలో ఉంచుకొని స్పల్పమార్పులు చేసిన పుస్తకాలను ముద్రించింది. ఈ పుస్తకాలను విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి బషీర్బాగ్లోని తన కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఉద్యోగార్థులకు ఉపయోగపడే విధంగా నిపుణులతో ఈ పుస్తకాలను రూ పొందించినట్టు చెప్పారు. రాష్ట్రంలోని గ్రంథాలయాలను కొలువుల కేంద్రాలుగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు.
జిల్లా కేంద్ర గ్రంథాలయాలు ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటలు, శాఖా గ్రంథాలయాలు ఉదయం 8 నుంచి 11, మధ్యాహ్నం 3-7 గంటల వరకు పనిచేయాలని సూచించారు. గ్రంథాలయాలకు వస్తున్న వారి సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని చెప్పారు. మన ఊరు-మన బడిలో ఎంపికైన ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో గ్రంథాలయాల ఏర్పాటుపై ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందించాలని సూచించారు. కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, గ్రంథాలయ పరిషత్ చైర్మన్ అయాచితం శ్రీధర్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన, ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసచారి పాల్గొన్నారు.