హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైలు మార్గాలపై నాలుగు ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి)ల నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం నిధులు మంజూరు చేసింది. రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్మించనున్న ఈ ఆర్వోబీల కోసం రూ. 404.82 కోట్లు ఖర్చవుతాయని ఆర్అండ్బీ అధికారులు అంచనా వేశారు. రైల్వేశాఖ కూడా తన వంతు వాటాగా రూ.154.80 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 250.02 కోట్లు మంజూరుచేస్తూ, ఆర్వోబీల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు ఆర్వోబీల నిర్మాణానికి నిధులు మంజూరుచేస్తూ పరిపాలనా అనుమతులు ఇచ్చిన సీఎం కేసీఆర్కు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.