Telangana | హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల్లో తెలంగాణ టాప్లో నిలిచిందని కేంద్ర జల్శక్తిశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ స్వయంగా ప్రకటించారు. 100% మార్కును దాటిందని ప్రశంసల జల్లు కురింపిచారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఓడీఎఫ్ ప్లస్ విభాగంలో దేశం సాధించిన పురోగతిని వెల్లడించారు. స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ్ ఫేజ్ 2 కింద భారతదేశంలో 40 శాతం గ్రామాలు తమను తాము ఓడీఎఫ్ ప్లస్గా ప్రకటించుకొన్నాయని తెలిపారు. ఏడాదిలో ఓడీఎఫ్ ప్లస్ గ్రామాల సంఖ్య మొత్తంగా 5 రెట్లు పెరిగిందని వివరించారు.
ఓడీఎఫ్ సాధించిన గ్రామాలు 2022 మార్చిలో 46,121 (7.4%) ఉండగా, ఈ మార్చి నాటికి 2,38,973 గ్రామాలకు (40.21%) పెరిగాయని వెల్లడించారు. వాటిలో 1,60,709 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ ఆస్పైరింగ్ క్యాటగిరీలో, 27,409 గ్రామాలు ప్లస్ రైజింగ్, 50,855 గ్రామాలు ఓడీఎఫ్ ప్లస్ మాడల్ క్యాటగిరీలో ఉన్నాయని వివరించారు. ఇక 100 శాతం ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలతో తెలంగాణ అగ్రగామిగా నిలిచిందని ప్రశంసించారు. తమిళనాడు 95.7 శాతం, కర్ణాటక 93.7 శాతం ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలతో ఆ తర్వాత స్థానంలో ఉన్నాయని తెలిపారు. మరోవైపు 2022లో 18 శాతంగా ఉన్న హిమాచల్ ప్రదేశ్ ప్రస్తుతం 79 శాతం, మధ్యప్రదేశ్ 6 నుంచి 62 శాతం, ఉత్తరప్రదేశ్ 2 నుంచి 47 శా తం, మిజోరం 6 నుంచి 35 శాతం గ్రామాలకు మాత్రమే మారిందని తెలిపారు. 100 శాతం ఓడీఎఫ్ ప్లస్ గ్రామాలను సాధించిన రాష్ర్టాలను ఆదర్శంగా తీసుకొని మిగతా అన్ని రాష్ర్టాలు ఆ బాటలో పయనించాలని గజేంద్రసింగ్ షెకావత్ సూచించారు.
ప్రతి ఇంటికి మరుగుదొడ్డి నిర్మించుకొం టే ఓడీఎఫ్గా ప్రకటిస్తారు. ఆ తర్వాతి దశ ఓడీఎఫ్ ప్లస్. ఓడీఎఫ్ ప్లస్గా గుర్తింపు పొం దాలంటే గ్రామంలోని ఇండ్లతోపాటు ప్రభు త్వ కార్యాలయాలు, సంస్థలన్నింటిలోనూ మరుగుదొడ్లు నిర్మించడం, ప్రతి గ్రామంలో ఇంటింటి నుంచి చెత్తను సేకరించడం, సేకరించిన చెత్తను డంపింగ్ యార్డుల్లో తడి, పొడి చెత్తగా వేరుచేయడం, శ్మశాన వాటిక, ఇంకుడు గుంతలు నిర్మించడం, రోడ్లపై నీళ్లు నిలువకుండా చేయడంవంటి కార్యకలాపాలు చేపట్టాలి. ఇలా అన్ని విభాగాల్లోనూ తెలంగాణ దేశంలో ముందు నిలిచింది. ఓడీఎఫ్ ప్లస్గా రాష్ట్రం గుర్తింపు పొందింది.
దేశంలో ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి ఉన్న రాష్ట్రంగా తెలంగాణ దేశంలోనే ముందు నిలిచింది. 99.50 శాతం ప్రజలకు సొంత మరుగుదొడ్డి ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది. తెలంగాణ సరసన చిన్న రాష్ట్రమైన పుదుచ్చేరి నిలిచింది. మిగిలిన రాష్ట్రాలు తెలంగాణ కంటే తక్కువ సంఖ్యలో మరుగుదొడ్లు కలిగి ఉన్నట్టు లెక్క తేలాయి. అలాగే, తెలంగాణలో 99.80 శాతం మందికి మరుగుదొడ్డి సౌకర్యం (టాయిలెట్ యాక్సెస్) ఉన్నట్టు కేంద్రం ప్రకటించింది.