హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రోజువారీ జీవితంలో ఆన్లైన్ లావాదేవీలు సర్వసాధారణం అయ్యాయి. ప్రతిచోట ఫోన్పే, గూగుల్పే, డెబిట్కార్డు, క్రెడిట్కార్డు.. ఇలా ఏదో ఒకదాన్ని వినియోగిస్తూనే ఉన్నాం. అదే సమయంలో ఆన్లైన్ లావాదేవీలు, చెల్లింపుల వ్యవహారాల్లో కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం శాపంగా మారుతున్నది. ఫలితంగా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోతున్న వారి సంఖ్య పెరుగుతున్నది. ‘లోకల్ సర్కిల్స్’ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో సైబర్ మోసాలపై విస్మయపరిచే విషయాలు వెల్లడయ్యాయి. దేశవ్యాప్తంగా గత మూడేండ్లలో తాము లేదా తమ కుటుంబంలో ఒకరు ఆర్థిక మోసానికి గురైనట్లు 42శాతం మంది ప్రజలు అంగీకరించారు.
అంటే సగటున ప్రతి పది మందిలో నలుగురు సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినవారే. దేశవ్యాప్తంగా ప్రతినెల 80వేల సైబర్ ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులు నమోదవుతుండగా.. దాదాపు రూ.200 కోట్ల వరకు నేరగాళ్లు ఆన్లైన్లో కొల్లగొడుతున్నట్టు సర్వే వెల్లడించింది. సైబర్ నేరగాళ్ల చేతిలో పోగొట్టుకున్న సొమ్ము రికవరీలోనూ ఆశించినమేర ఫలితాలు ఉండటం లేదు. సైబర్క్రైం పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలన్నీ కలిపి మూడేండ్లలో 17శాతం కేసుల్లో మాత్రమే బాధితుల సొమ్మును రికవరీ చేయగలిగారు. అయితే ఆన్లైన్ లావాదేవీల్లో తగిన జాగ్రత్తలు పాటించకపోవడంతోపాటు.. బాధితుల స్వయంకృతాపరాధాలే వారిని మోసగాళ్ల చేతికి చిక్కేలా చేస్తున్నాయని లోకల్ సర్కిల్స్ సంస్థ అభిప్రాయపడింది.