హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా యూనివర్సిటీలో రూ.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్న హాస్టల్ భవనానికి విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డి, పశు సంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి సబిత మాట్లాడుతూ.. ఓయూ క్యాంపస్లో బాలురకు మెరుగైన వసతి కల్పించడం కోసం కొత్త హాస్టల్ నిర్మిస్తున్నట్టు తెలిపారు. మూడు అంతస్తుల్లో నిర్మించనున్న ఈ భవనంలో 660 మందికి వసతి కల్పించనున్నామని తెలిపారు. 2.76 ఎకరాల స్థలంలో 1,06,292 చదరపు అడుగుల విస్తీర్ణంతో 165 గదులను నిర్మించనున్నామని చెప్పారు. గోదావరి, సరయు హాస్టళ్ల పక్కనే ఈ హాస్టల్ నిర్మాణానికి అన్ని అనుమతులు వచ్చాయని తెలిపారు. ఓయూలో ఈసారి ఎన్నడూలేని విధంగా 65 శాతం మంది విద్యార్థినులు ప్రవేశాలు పొందడం అభినందనీయమని అన్నారు.