హైదరాబాద్, జనవరి 9 (నమస్తేతెలంగాణ)/నిజామాబాద్ క్రైం: నిజామాబాద్కు చెందిన పప్పుల సురేశ్ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆత్మహత్యకు ముందు బాధితులు రాసిన సూసైడ్ నోట్ వెలుగులోకి వచ్చింది. వడ్డీ వ్యాపారుల వేధింపులే ఆత్మహత్యకు కారణమని లేఖలో పేర్కొన్నారు. ఇబ్బందులు పెట్టిన వారి వివరాలను లేఖలో వెల్లడించారు. వేధింపులకు గురిచేసిన వారి వివరాలను సెల్ఫీ వీడియోను తీసి బంధువులకు పంపించారు. సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియోలను విజయవాడ పోలీసులు స్వాధీనం చేసుకొని విచారణ ప్రారంభించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగించారు.
నలుగురు వడ్డీ వ్యాపారుల గుర్తింపు..
సురేశ్ కుటుంబం ఆత్మహత్య కేసులో విజయవాడ పోలీసులు విచారణను వేగవంతం చేశారు. మృతుల సూసైడ్ నోట్, సెల్ఫీ వీడియో ఆధారంగా వివరాలను సేకరించారు. వేధింపులకు గురిచేసిన నలుగురు వడ్డీ వ్యాపారులను పోలీసులు గుర్తించారు. ఇద్దరు నిర్మల్కు చెందిన వారు, మరో ఇద్దరు నిజామాబాద్ వడ్డీ వ్యాపారులుగా నిర్ధారించారు. వ్యాపారుల వేధింపులపై ఆడియోకాల్ రికార్డులు సేకరిస్తున్నారు. వేధింపులకు పాల్పడిన వారి వివరాలను సురేశ్ బంధువులు పోలీసులకు అందజేశారు.