రియల్ఎస్టేట్ సంస్థపై అటవీశాఖ చర్యలు
హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): వెంచర్ అభివృద్ధి కోసం అనుమతుల్లేకుండా చెట్లు నరికిన ఓ రియల్ఎస్టేట్ సంస్థకు అటవీశాఖ రూ.4 లక్షలు జరిమానా విధించింది. తొలగించిన చెట్లకు బదులు మళ్లీ మొక్కలు నాటి, సంరక్షించాలని ఆదేశించింది. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు పరిధిలో వెస్ట్సైడ్ అనే రియల్ఎస్టేట్ సంస్థ ఓ వెంచర్ను ఏర్పాటుచేసింది. సంస్థ ప్రతినిధులు ఇందుకోసం అక్కడున్న 65 చెట్లను ఎలాంటి అనుమతులు లేకుండా గతవారం నరికివేశారు. ఈ విషయంపై స్థానికులు.. అటవీశాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి.. చెట్లు తొలగించినట్టు నిర్ధారించారు. వాల్టా చట్టం ప్రకారం సంస్థకు బుధవారం జరిమానా విధించారు.
చట్టం నుంచి ఎవరూ తప్పించుకోలేరు: ఎంపీ సంతోష్కుమార్
చిలుకూరు పరిధిలో 65 చెట్లు నరికివేసిన రియల్ఎస్టేట్ సంస్థ మీద చర్యలు తీసుకోవడంపై గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ట్విట్టర్లో స్పందించారు. ‘తప్పుచేసిన వారెవరైనా చట్టం నుంచి తప్పించుకోలేరు. చెట్లు నరికిన వారిపై తక్షణమే చర్యలు తీసుకున్న రెవెన్యూ, అటవీ అధికారులకు అభినందనలు. తమకు నచ్చినట్టు ఏదైనా చేసుకోవచ్చని భావించేవారికి ఈ చర్య కఠినమైన హెచ్చరికను పంపించింది’ అని పేర్కొన్నారు.