హైదరాబాద్ : భైంసా పట్టణంలోని సిద్ధార్థనగర్ బుద్ధవిహార్ వద్ద చెరువులో పురాతన బుద్ధుడి శిల్పం బయటపడింది. క్రీస్తుశకం మూడో శతాబ్దానికి చెందిందని చరిత్రకారులు చెబుతున్నారు. నిర్మల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల చరిత్ర అధ్యాపకుడు కటకం మురళీ సోన్బా నేతృత్వంలోని కొత్త తెలంగాణ చరిత్రబృందం సభ్యులు త్రిశరణ్, అక్షయ్, శుభం, మహేందర్ తదితరులు కొంతకాలంగా నిర్మల్ కోటపై పరిశోధనలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బుద్ధవిహార్ వద్ద బుద్ధుని శిల్పాన్ని గుర్తించినట్లు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు.
తొలిసారి భైంసాలో బౌద్ధం ఆనవాళ్లు లభించినట్లు ఆయన చెప్పారు. ఈ బుద్ధుని శిల్పం ఎరుపురంగు ఇసుకరాతితో చెక్కినదని, 19 అంగుళాల ఎత్తు, 10అంగుళాల వెడెల్పు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది గతంలో నాగార్జునకొండ, ఫణిగిరిల్లో లభించిన బుద్ధుని శిల్పాలను పోలివుందని చెప్పారు. ఈ విగ్రహంలో బుద్ధుడు ధర్మచక్ర పరివర్తన ముద్రలో ఉన్నట్లు, శరీరంపై సంఘాతి(పైవస్త్రం), తలపై ఉష్ణీషం, తలవెనుక కాంతిపరివేశం చెక్కివున్నట్లు వివరించారు.