హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్లో రోజురోజుకు ట్రాఫిక్ సమస్య పెరుగుతుండడంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యపై సీఎం రేవంత్రెడ్డి పలుమార్లు సమీక్ష నిర్వహించారు. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో క్షేత్రస్థాయి పరిశీలన ద్వారా తెలుసుకొని నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాలతో జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు నగరంలో పర్యటించి పరిశీలించారు. జనాభా పెరుగుదలతోపాటు వాహనాల సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతుండడంతో సమస్య రోజురోజుకు మరింతగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు టన్నెల్ రోడ్ల నిర్మాణంపై దృష్టిసారించి ఆ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది. ఎన్నికల ప్రచార సమయంలో రేవంత్రెడ్డి కూడా ఇదే ఆలోచనను వెల్లడించారు. ఇప్పుడు అధికారులు కూడా అదే ప్రతిపాదనను తీసుకొచ్చారు. ఇందులో భాగంగా నగరంలోని ఐదు కీలక ప్రాంతాలను ఎంచుకున్నారు. ఐటీసీ కోహినూర్ కేంద్రంగా చేసుకుని మూడు మార్గాల్లో సొరంగ రహదారుల నిర్మాణాన్ని ప్రతిపాదించారు. ఇందులో పాతనగరానికి కూడా ప్రాధాన్యమిచ్చారు. దాదాపు 39 కిలోమీటర్ల మేర టన్నెల్ రోడ్ల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను గుర్తించడంతోపాటు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం అధికారులు ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) బిడ్ల కోసం టెండరు జారీచేశారు. టీబీఎం (టన్నెల్ బోరింగ్ మిషన్) ద్వారా సొరంగ రహదారుల నిర్మాణంపై సాంకేతికంగా నివేదికను అందించేందుకుగాను కన్సల్టెన్సీని ఎంపిక చేయనున్నారు.
“రోడ్లు, ఫ్లైఓవర్లు అనేది ఒక లెవల్ టెక్నాలజీ. అంతకుమించి టన్నెల్ టెక్నాలజీ ఉంది. స్ట్రెయిట్ కనెక్టివిటీ లైన్. దిల్సుఖ్నగర్ నుంచి జూబ్లీహిల్స్ వరకు వెళ్లాలనుకున్నా! బహదూర్పుర నుంచి బాలానగర్ వరకు వెళ్లాలనుకున్నా అండర్ టన్నెల్ రోడ్డు ద్వారా స్ట్రెయిట్గా వెళ్లొచ్చు. బయటి రోడ్లు ఉన్నట్టు కాదు. టన్నెల్ బోరింగ్ మిషన్ (టీబీఎం)తో ఎంత కావాలంటే అంత రోడ్డు వేసుకోవచ్చు”గత నవంబరు 3న బషీర్బాగ్ ప్రెస్క్లబ్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా టీయూడబ్ల్యూజే ‘మీట్ది ప్రెస్’లో సీఎం రేవంత్రెడ్డి వ్యక్తపరిచిన ఆలోచన ఇది. ఇందుకు అనుగుణంగా జీహెచ్ఎంసీ అధికారులు గ్రేటర్ హైదరాబాద్లో సొరంగ రహదారుల ప్రతిపాదనలపై తొలి అడుగువేశారు. నగర పౌరులను ట్రాఫిక్ కష్టాల నుంచి బయటపడేసేందుకు టన్నెల్ రోడ్ల (సొరంగ రహదారులు) నిర్మాణాలపై అధికారులు దృష్టిసారించారు. నగరంలో ఐదుచోట్ల 39 కిలోమీటర్ల పొడవున టన్నెల్ రోడ్ల నిర్మాణం సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఆసక్తి వ్యక్తీకరణ టెండర్ పిలిచారు.