హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమానికి, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమైతే, కేసీఆర్ను నడిపించింది పుస్తకాలేనని క్రీడలు, సాంస్కృతిక శాఖల మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. అంతటి గొప్పతనం పుస్తకాలది అని ఆయన చెప్పారు. శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో తెలంగాణ కళాభారతి (చిందు ఎల్లమ్మ) వేదికగా 34వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ను మంత్రి శ్రీనివాస్గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాముడు ఎట్లుంటడో తెలియకున్నా, ఆయన గుణగణాలను తెలిపింది పుస్తకమేనని అన్నారు. తాళపత్ర గ్రంథాలు మొదలుకొని డిజిటల్ యుగంలో కూడా మనిషికి మార్గదర్శిగా పుస్తకమే నిలుస్తున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కవులు, రచయితలకు మాగాణం అని ఆయన కొనియాడారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి, గౌరవిస్తున్నదని తెలిపారు. బమ్మెర పోతన, కాళోజీ, సర్దార్ సర్వాయి పాపన్న, సురవరం ప్రతాపరెడ్డి లాంటి కవులు, రచయితలు పుస్తకాలు చదివి, ఎన్నో రచనలుచేసి గొప్ప ఆదర్శ వ్యక్తులుగా ఎదిగారని, అంతటి చరిత్ర మన తెలంగాణ సొంతం అని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఫోన్లు చూసేవారు ఎక్కువైనా, పుస్తకానికి ఉన్న విలువ ఏ మాత్రం తగ్గలేదని అన్నారు.
సత్య హరిశ్చంద్రుడు మొదలుకొని ఆధునికయుగం వరకూ న్యాయం, ధర్మాలను బోధించేది పుస్తకమేనని గుర్తుంచుకోవాలని సూచించారు. బీసీ సంక్షేమశాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం మాట్లాడుతూ ‘ప్రపంచం నన్ను దూరం కొడితే పుస్తకం నన్ను అమ్మలా ఆదరించి దరికి చేర్చింది’ అని అంబేద్కర్, ‘ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్ల కదలిక’ అని కాళోజీ అన్నారని గుర్తుచేశారు. ప్రపంచానికి జ్ఞానాన్ని అందించే ఒకే ఒక్క సాధనం పుస్తకమేనని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ, హైదరాబాద్ పుస్తక ప్రదర్శన సొసైటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్, బీసీ స్టడీ సర్కిల్ అధికారి బాలాచారి, తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత ఏ పద్మాచారి, పలువురు సాహిత్య ప్రియులు హాజరయ్యారు. కాగా, బుక్ఫెయిర్లో తెలుగు వికీపీడియా స్టాల్ను ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ ప్రారంభించి మాట్లాడారు. తెలుగు భాషాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిజిటల్ మీడియా విభాగం డైరెక్టర్ దిలీప్ కొణతం పాల్గొన్నారు. మరోవైపు, బుక్ ఫెయిర్లో నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే దినపత్రికల స్టాల్(136, 137)ను సంస్థ వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి ప్రారంభించారు. కార్యక్రమంలో సర్క్యులేషన్ డీజీఎం డీ రాంరెడ్డి, సికింద్రాబాద్ డివిజన్ ఏసీఎం సుధాకర్, వినయ్కుమార్, సృజన్రెడ్డి, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.