హైదరాబాద్, డిసెంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భావం తర్వాత బొగ్గు ఉత్పత్తి, టర్నోవర్, లాభాల ఆర్జనలో జోరుగా ముందుకు సాగుతున్న సింగరేణి సంస్థ.. యువతకు ఉద్యోగాలు కల్పించడంలోనూ అగ్రస్థానంలో నిలిచింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో సంస్థలోని ఖాళీలను ఎప్పటికప్పుడు భర్తీ చేస్తూనే, కారుణ్య నియామకాల ప్రక్రియ ద్వారా ప్రతినెలా సగటున 250 మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నది. ఈ ప్రక్రియ ఇకముందు కూడా ఇలాగే కొనసాగుతుందని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు సింగరేణిలో 16,040 మంది యువతకు ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. వీటిలో కారుణ్య, వారసత్వ నియామకాలు 12,553, డైరెక్ట్ ఓపెన్ రిక్రూట్మెంట్లు 3,498 ఉన్నాయని తెలిపారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ల కోసం 2014 నుంచి 58 నోటిఫికేషన్లు జారీచేసిన సింగరేణి.. ఇప్పటివరకు 85 మెడికల్ బోర్డులు నిర్వహించి అన్ఫిట్ అయిన కార్మికుల స్థానంలో 12,553 మంది వారసులకు ఉద్యోగాలు కల్పించిందని వివరించారు. ప్రస్తుతం చాలా ఉద్యోగాల్లో అదనపు విద్యార్హతలున్నవారు ఉండటంతో కొత్త ఖాళీలను అర్హులైన ఇంటర్నల్ అభ్యర్థులతో భర్తీచేయాలని నిర్ణయించామని, ఈ విధంగా 35 క్యాటగిరీల్లో 2,909 మందికి ఉద్యోగాలు కల్పించామని చెప్పారు.
స్వరాష్ట్రంలో తొలి నోటిఫికేషన్ సింగరేణిదే
స్వరాష్ట్రంలో మొదటి నోటిఫికేషన్ సింగరేణి నుంచే రావడం ముదావహం. ఇంటర్వ్యూల్లో పొరపాట్లు జరిగే అవకాశం ఉన్నందున కేవలం రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నాం. కారుణ్య నియామకాల ప్రక్రియ ద్వారా ప్రతి నెలా సగటున 250 మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాం.