జహీరాబాద్, జనవరి 23: ‘వన్ వెహికిల్-వన్ ఫాస్టాగ్’ విధానం అమలులో భాగంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) వాహనదారులను సత్వరమే ఫాస్టాగ్కు కేవైసీ చేసుకోవాలని ఆదేశాలు జారీచేసింది. లేదంటే ఈ నెల 31 తర్వాత ఫాస్టాగ్లు చెల్లవని హెచ్చరించింది. టోల్గేట్ల వద్ద టోల్ వసూలును సులభతరం చేయడానికి కేవైసీ పూర్తిచేయని ఫాస్టాగ్లను నిలుపుదల చేయాలని నిర్ణయించినట్టు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు.
కేవైసీ చేసుకోని ఫాస్టాగ్లను సంబంధిత బ్యాంకులు బ్లాక్ చేస్తాయని చెప్పారు. వాహనదారులు ఇబ్బందులకు గురికాకుండా ఉండాలంటే వెంటనే ఫాస్టాగ్లకు కేవైసీ చేసుకోవాలని ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. కేవైసీపై పూర్తి సమాచారం కోసం సమీపంలోని టోల్ప్లాజాలు లేదా- సంబంధిత బ్యాంకు కస్టమర్ కేర్ సెంటర్లను సంప్రదించాలని సూచించింది.
ఫాస్టాగ్ స్టిక్కర్ నిబంధనలు పాటించాల్సిందే
ఫాస్టాగ్ను వాహనానికి అమర్చే విషయంలో నిబంధనలను కూడా ఎన్హెచ్ఏఐ ప్రకటించింది. ఫాస్టాగ్ స్టిక్కర్ను వాహనం ముందుభాగంలో పెట్టాలని అధికారులు తెలిపారు. కొందరు వాహనదారులు ఒకే ఫాస్టాగ్ను ఇతర వాహనాలకు ఉపయోగిస్తున్నారని అన్నారు. ఒకే వాహనం ఫాస్టాగ్ను అనేక వాహనాలకు లింక్ చేస్తున్నారని తమ దృష్టికి వచ్చినట్టు ఎన్హెచ్ఏఐ పేర్కొంది.
జీపీఎస్ విధానం ద్వారా టోల్చార్జీలు
మార్చి నుంచి జీపీఎస్ విధానం ద్వారా టోల్చార్జీలు వసూలు చేస్తామని, జియో పొజిషనింగ్ సిస్ట మ్ (జీపీఎస్) ఆధారిత వ్యవస్థను తీసుకొస్తున్నట్టు ఇటీవల కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. వచ్చే మార్చి నాటికి దేశవ్యాప్తంగా జీపీఎస్ ఆధారిత వ్యవస్థ అమలుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. జీపీఎస్తో హైవేపై ప్రయాణించిన దూరానికి మాత్రమే టోల్ఛార్జీలు కట్టాల్సి ఉంటుంది. జీపీఎస్ విధానం అందుబాటులోకి వస్తే టోల్గేట్ల వద్ద వాహనాలను ఆపాల్సిన పని లేకుండా ఆటోమేటిక్ నంబర్ప్లేట్ రీడర్లను ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారు. దేశంలో ఈ విధానం అమలు కోసం రెండు పైలట్ ప్రాజెక్టులు చేపట్టినట్టు ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు.
కేవైసీ ఎలా చెక్ చేసుకోవాలి
ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ తెలుసుకోవాలంటే మీ ఈ-మెయిల్కు, ఎస్ఎంఎస్ లేదా మీ బ్యాంకు యాప్లకు వచ్చిన నోటిఫికేషన్లను చెక్ చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్లు మీ ఫాస్టాగ్ కేవైసీ పూర్తికాకపోతే మిమ్మల్ని హెచ్చరిస్తాయి. మీ మెయిల్, బ్యాంకు యాప్లకు ఫాస్టాగ్లకు సంబంధించిన ఎలాంటి నోటిఫికేషన్ రాలేదంటే మీ కేవైసీ పూర్తి అయ్యిందని తెలుసుకోవాలి. ఫాస్టాగ్కు కేవైసీ ఉందా లేదా అనే విషయం తెసుకునేందుకు https; /fastag.ihmcl.com వెబ్సైట్ను సందర్శించి.. మీ వివరాలను నమోదు చేసి పోర్టల్లో లాగిన్ అవ్వాలి.
అక్కడ మీకు ఫాస్టాగ్ కేవైసీ స్టేటస్ కనిపిస్తుంది. కేవైసీ ఇన్కంప్లీట్గా ఉంటే అక్కడ కేవైసీని అప్డేట్ చేసుకోవాలి. మీకు ఫాస్టాగ్ జారీచేసిన బ్యాంకును ఎంచుకుని అక్కడే ఫాస్టాగ్ కేవైసీ ప్రక్రియను నమోదు చేసుకోవాలి. అవసరమైన గుర్తింపు అడ్రస్ ప్రూఫ్, డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. పాస్పోర్ట్ సైజ్ ఫొటోను అప్లోడ్ చేసుకోవాలి. వివరాలన్నీ పూర్తి చేసుకుని చెక్ చేసుకోవాలి. డిక్లరేషన్ను కన్ఫర్మ్ చేసి, తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అవసరమైన పత్రాలను సమర్పించిన తర్వాత కేవైసీ ధ్రువీకరణ పూర్తవుతుంది.