హైదరాబాద్, ఆగస్టు 27 (నమస్తే తెలంగాణ): టీజీఎస్ఆర్టీసీలో కొలువుల భర్తీకి మరో రెండు, మూడు వారాల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ కొత్త బస్సుల కొనుగోలు, ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నష్టాల్లో ఉన్న ఆర్టీసీని మహాలక్ష్మి పథకం ద్వారా లాభాల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. భారీగా ఉద్యోగాల భర్తీ, పెద్దసంఖ్యలో బస్సులను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ఆర్టీసీని బలోపేతం చేస్తామని ఆయన వెల్లడించారు. ఇప్పటికే తొలి దశలో 3,035 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయించామని, సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనికి ఆమోదం తెలిపారన్నారు. ఇందుకు సంబంధించి 2, 3 వారాల్లో నోటిఫికేషన్లు వస్తాయని పొన్నం తెలిపారు. మరో మూడు, నాలుగు వేల పోస్టుల భర్తీ అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని, దీనిపై కూడా త్వరలో ప్రకటన వెలువరిస్తామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీన ప్రక్రియపై కమిటీ నివేదిక రావాల్సి ఉన్నదని మంత్రి పొన్నం వివరించారు.
ఆర్టీసీలో త్వరలో భర్తీ చేయనున్న పోస్టులు
2000 డ్రైవర్, 743 శ్రామిక్,114 డిప్యూటీ సూపరింటెండెంట్(మెకానిక్), 84 డిప్యూటీ సూపరింటెండెంట్(ట్రాఫిక్), 25 డిపో మేనేజర్/అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్, 23 అసిస్టెంట్ ఇంజినీర్(సివిల్), 15 అసిస్టెంట్ మెకానికల్ ఇంజినీర్,11 సెక్షన్ ఆఫీసర్(సివిల్), 7 మెడికల్ ఆఫీసర్(జనరల్), 7 మెడికల్ ఆఫీసర్(స్పెషలిస్ట్) పోస్టులు ఉన్నాయి.