సూర్యాపేట, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ) : సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఏకకాలంలో పలు మిల్లుల్లో రెవెన్యూ, పౌరసరఫరాల, పోలీసు శాఖల నేతృత్వంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అర్ధరాత్రి వరకు కూడా తనిఖీలు జరుగుతుండగా బుధవారం కూడా కొనసాగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. కేవలం మూడు మిల్లుల్లోనే దాదాపు రూ.300 కోట్ల విలువైన ప్రభుత్వ ధాన్యం మాయమైనట్టు తెలుస్తున్నది.
అదనపు కలెక్టర్లు ప్రియాంక, సూర్యాపేట ఆర్డీవో వేణుమాదవ్, సివిల్ సప్లయీస్ జిల్లా మేనేజర్ రాములు, డీఎస్వో మోహన్బాబుతోపాటు ఇతర అధికారులు, సిబ్బంది మూడు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో మూడు ప్రాంతాల్లోని మిల్లులను తనిఖీ చేశారు. తిరుమలగిరి మండల కేంద్రంలోని సంతోషిమాత, నాగారం మండలంలోని రఘురామతోపాటు సూర్యాపేటలో జగన్మాత, కోదాడలో శ్రీవేంకటేశ్వర పారాబాయిల్డ్లో రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయా మిల్లులకు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల నుంచి ఎంత ధాన్యం వెళ్లింది? కస్టమ్ మిల్లింగ్ రైస్ను తిరిగి ప్రభుత్వానికి ఎంత పెట్టారు? అనేది పరిశీలించి ఇంకా మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం లెక్కలు తేల్చారు.
అధికారికంగా లెక్కలు తెలియనప్పటికీ ఒక మిల్లులో ధాన్యం లెక్క ప్రకారం ఉండగా మిగతా మూడు మిల్లుల్లో సుమారు రూ.100 కోట్ల చొప్పున రూ.300 కోట్ల మేర ధాన్యం లెక్క తేలడం లేదని అనధికారిక సమాచారం. గత రెండు సీజన్ల నుంచి కోట్లాది రూపాయల విలువ చేసే ధాన్యం తీసుకుని ఒక్క కిలో కూడా బియ్యం ఇవ్వని 6 మిల్లులతోపాటు గతంలో సకాలంలో బియ్యం అందించక విఫలమైన 32 మిల్లులపై అధికారులు దృష్టిసారించారు. తాజాగా నాలుగు మిల్లుల లెక్క తేలనుండగా ఆ వెంటనే మిగిలిన మిల్లుల్లో తనిఖీలు చేపట్టనున్నట్టు అధికారులు తెలిపారు.