హైదరాబాద్, జనవరి 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఆహార శుద్ధి పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతున్నది. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో ఆహార శుద్ధి పరిశ్రమ స్థిర మూలధనం రూ.4,436 కోట్లు ఉండగా, 2021 నాటికి అది 53 శాతం పెరిగి రూ.6,812 కోట్లకు చేరుకొన్నది. మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ డాటా ప్రకారం.. ఏడేండ్లలో ఈ రంగం రూ.2,376 వృద్ధిని నమోదు చేసింది. రానున్న రోజుల్లో మరో రూ.4,900 కోట్ల వరకు పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయి. దీంతో స్థిర మూలధనం రూ.10 వేలకోట్లు దాటిపోనున్నది. రాష్ట్రం ఏర్పడేనాటికి ఉన్న స్థిర మూలధనంతో పోల్చితే ఇది రెట్టింపు.
1,031 యూనిట్లకు 3,038 ఎకరాల భూములు
టీఎస్ఐపాస్ డాటా ప్రకారం ఆహార శుద్ధి రంగంలో 2017-2021 మధ్య 2,140 యూనిట్ల ద్వారా రూ.2,376 కోట్ల పెట్టుబడులు రాగా, 29,841 మందికి ఉద్యోగాలు లభించాయి. ఆయిల్ మిల్లులు, రైస్ మిల్లులు, డెయిరీ యూనిట్లు, స్పైసెస్ ప్రాసెసింగ్ యూనిట్లు తదితరాల్లో అధికంగా పెట్టుబడులు రావడం విశేషం. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతోపాటు వ్యవసాయ ఉత్పత్తులకు విలువను జోడించి రైతులను బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం 2021లో ప్రత్యేక ఆహార శుద్ధి మండళ్లను ప్రారంభించి, ఆహార శుద్ధి విధానాన్ని ప్రకటించింది.
ప్రారంభానికి సిద్ధంగా 834 మైక్రో యూనిట్లు
ప్రభుత్వం మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఆంత్రప్రెన్యూర్ యూనిట్ల ఏర్పాటునకు ప్రోత్సాహకంగా రూ.10 లక్షల వరకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ కల్పిస్తున్నది. నవంబర్ 2022 నాటికి 834 మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, కొలాటరల్ ఫ్రీ లోన్, క్యాపిటల్ గ్రాంట్ తదితర ప్రోత్సాహకాలు అందించింది. ఈ యూనిట్లు ప్రస్తుతం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. వీటితోపాటు మరో 3,132 యూనిట్లకు అనుమతుల జారీ ప్రక్రియ కొనసాగుతున్నదని వివరించారు.
సాకారమవుతున్న సీఎం సంకల్పం
ఆహార శుద్ధి పరిశ్రమ సాధిస్తున్న అభివృద్ధితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం సాకారమవుతున్నది. వ్యవసాయం, అనుబంధ రంగాలైన పాడి, పౌల్ట్రీ, లైవ్ స్టాక్ తదితర రంగాల్లో పెట్టుబడి పెరిగింది. దీంతో ప్రభుత్వం ఆహార శుద్ధి రంగాన్ని ముఖ్యమైన రంగాల్లో ఒకటిగా గుర్తించింది. ఈ రంగంలో పెట్టుబడుల ఆకర్షణకు అవసరమైన అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించటంతో పెట్టుబడులు వెల్లువెత్తాయి. ఆహార శుద్ధి పరిశ్రమలో మహిళా సంఘాలకు ఉపాధి అవకాశాలను పెంపొందించడం, రేషన్ డీలర్లకు అదనపు ఆదాయం కల్పించడం, ప్రజలకు కల్తీ లేని ఆహార ఉత్పత్తులను అందించడం, తద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ ఆహార శుద్ధి పరిశ్రమల ద్వారా గ్రామీణ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయి.
ఆహార శుద్ధి విధాన ప్రకటన అనంతరం పురోగతి
ప్రత్యేక ఆహార శుద్ధి మండళ్లు 21 (7,150 ఎకరాలు)
పెట్టుబడుల మొత్తం – రూ.2,396 కోట్లు
వచ్చిన దరఖాస్తులు – 1,496
ఏర్పాటైన యూనిట్లు – 1,031
భూ కేటాయింపు – 3,038 ఎకరాలు
పరిశ్రమలు – రైస్మిల్లులు, ఇథనాల్ పరిశ్రమలు, డెయిరీ, ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్లు