హైదరాబాద్ : సమగ్ర శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ), కేజీబీవీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త చెప్పింది. ఆయా ఉద్యోగుల వేతనాలను 30శాతం పెంచింది. ఈ మేరకు శనివారం విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా జీవో -117ను జారీచేశారు. పెరిగిన వేతనాలను జూన్ 1, 2021 నుంచి వర్తింపజేయనున్నారు. జూలైలో అందజేసే వేతనంలో కలిపి ఇవ్వనున్నారు. సమగ్రశిక్ష అభియాన్తోపాటు, కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో 5వేల పైచిలుకు ఉద్యోగులు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. వీరి వేతనాలను పెంచుతామని, పీఆర్సీని వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్ గతంలో అసెంబ్లీలో ప్రకటించారు.
ఈ మేరకు 2020 పీఆర్సీ ప్రకారం వీరికి వేతనాలను పెంచాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వీరి వేతనాలు పెంచేందుకు గాను సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఆయా ప్రతిపాదనలను పరిశీలించిన సర్కారు 30శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. సమగ్ర శిక్ష అభియాన్లో పాఠశాల, క్లస్టర్, మండలం, జిల్లా, రాష్ట్రస్థాయిలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్తోపాటు, కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతనాలను సైతం పెంచుతున్నట్లు జీవోలో పేర్కొన్నారు. వేతనాల పెంపు పట్ల పలు సంఘాల నాయకులు హర్షం వ్యక్తంచేశారు.