హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రైళ్ల పేరుతో దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు 30 శాతం అదనపు చార్జీలతో ప్రయాణికులను వీరబాదుడు బాదుతున్నారు.వారి జేబులకు చిల్లులు పెడుతూ బెంబేలేత్తిస్తున్నారు. కరోనా తర్వాత మొదలైన ప్రత్యేక రైళ్ల పరంపర నేటికీ కొనసాగుతూనే ఉన్నది. తెలంగాణ, ఏపీ నుంచి తిరుపతికి వెళ్లే భక్తుల మనో భావాలు, వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎస్సీఆర్ అధికారులు ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటున్నారు. ముఖ్యంగా సికింద్రాబాద్ నుంచి తిరుపతి, కాచిగూడ నుంచి తిరుపతి, హైదరాబాద్ నుంచి తిరుపతి.. విజయవాడ, గుంటూరు, కాజీపేట్, కొల్హాపూర్ నుంచి తిరుపతి.. ఇలా అనేక రకాలైన స్టేషన్ల నుంచి తిరుపతికి వెళ్లే భక్తుల కోసం సాధారణ ఎక్స్ప్రెస్లు నడపాల్సిన దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు ఆ సంగతి వదిలిపెట్టి ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. కరోనా సడలింపు తర్వాత కొన్ని సర్వీసులతో మొదలైన ప్రత్యేక రైళ్ల రాకపోకలు.. రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయని ప్రయాణికులు అంటున్నారు. రైల్వే శాఖ నష్టాల్లో ఉందంటూ.. అదనంగా వసూలు చేస్తున్న దాఖలాలు ఉన్నాయని రైల్వే మజ్దూర్ సంఘ్ నాయకులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. మధ్య తరగతి కుటుంబాలకు అండగా ఉండాల్సింది పోయి, అధిక చార్జీలతో భారీ దోపిడీకి పాల్పడుతున్న రైల్వే యంత్రాంగంపై ప్రయాణికులు, విశ్లేషకులు మండిపడుతున్నారు.