Gas cylinder price | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ఐదు రాష్ర్టాల్లో ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వంట గ్యాస్ ధరను రూ.200 తగ్గిస్తున్నట్టు కేంద్రం చేసిన ప్రకటన పంపిణీదారులకు పిడుగుపాటుగా పరిణమించింది. ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా గ్యాస్ ధరను తగ్గించడం తమకు తీవ్ర నష్టాన్ని కలుగజేస్తుందని పంపిణీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద ఉన్న స్టాకును ఇప్పుడు అనివార్యంగా తక్కువ ధరకు విక్రయించాల్సి వస్తుందని, ఈ నష్టాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించాలని వారు కోరుతున్నారు. కేంద్రం ప్రకటనతో తెలంగాణవ్యాప్తంగా మూడు చమురు మార్కెటింగ్ కంపెనీల పంపిణీదారులకు సుమారు రూ.30 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని అసోసియేషన్ పేర్కొంది.
సాధారణంగా పంపిణీదారులు జిల్లా పరిధుల్లోనైతే ఒక రోజుకు, హైదరాబాద్, ఇతర పట్టణాల్లోనైతే రెండురోజులకు సరిపోయే స్టాక్ ఉంచుకుంటారు. తెలంగాణలో సుమారు 900 మందికి పైగా పంపిణీదారులు ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 180 మంది పంపిణీదారుల వద్ద దాదాపు 47 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. రాష్ట్రంలోని 900 మంది పంపిణీదారుల వద్ద రమారమి 1000-1500 వరకు సిలిండర్లు స్టాక్గా ఉన్నాయి. వీటిని తగ్గింపు ధరకు అందించాల్సి ఉన్నందున ఆ మేరకు నష్టాన్ని భరించాలి. ఇలా రాష్ట్రవ్యాప్తంగా పంపిణీదారులందరిపై సుమారు రూ.30 కోట్ల మేర భారం పడుతుందని టీఎస్ ఎల్పీజీ గ్యాస్ పంపిణీదారుల సంఘం అధ్యక్షుడు కే జగన్మోహన్రెడ్డి తెలిపారు.