హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): దసరా పండుగ రద్దీని అడ్డుపెట్టుకుని కొన్ని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్టు దృష్టికి రావడంతో రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవే టు ట్రావెల్స్ బస్సులపై ఆర్టీఏ అధికారులు 30 కేసులు నమోదు చేశారు. ప్రధానంగా పర్మిట్ కండిషన్, కమర్షియల్ లగేజీ తీసుకెళ్లడం, అనుమతికి మించి ప్రయాణికులకు ఎక్కించుకోవడం, అధిక చార్జీలు వసూలు చే యడంపై ఆర్టీఏ అధికారులు దృష్టిపెడుతున్నారు. విజయవాడ హైవే, బెంగళూరు మార్గాల్లో గత కొద్దిరోజులుగా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సు డ్రైవర్లకు పోలీసుల సహకారంతో డ్రంకెన్ డ్రైవ్ టెస్ట్లు నిర్వహిస్తున్నారు. అధికచార్జీలు వసూలు చేస్తే రవాణాశాఖ అధికారుల దృష్టికి తేవాలని అధికారులు ప్రజలకు సూచిస్తున్నారు.