యాదాద్రి భువనగిరి, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ) : ‘మా బిడ్డలు ఆత్మహత్య చేసుకోలేదు. సూసైడ్ చేసుకునేంత పిరికివాళ్లు కాదు. హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి. మాకు న్యాయం చేయాలి’ అని డిమాండ్ చేస్తూ భువనగిరిలోని ఓ హాస్టల్లో చనిపోయిన పదోతరగతి విద్యార్థినులు భవ్య, వైష్ణవి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని ఎస్సీ హాస్టల్ ఎదుట, ఆ తర్వాత ఏరియా దవాఖాన ఎదుట మెయిన్ రోడ్డుపై బైఠాయించారు. ఉదయం నుంచే ఎస్సీ హాస్టల్కు వచ్చిన కుటుంబ సభ్యులు అక్కడే ధర్నాకు దిగారు. స్థానికులు, ప్రజా సంఘాల వారు వారికి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో అక్కడి నుంచి స్థానిక ఏరియా దవాఖాన ముందు మెయిన్ రోడ్డుపై బైఠాయించారు.
వీరికి బీఆర్ఎస్తోపాటు విద్యార్థి, మహి ళా, ప్రజా సంఘాలు మద్దతుగా నిలిచాయి. రోడ్డుపైనే ఆందోళనకు దిగి పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్డెన్, వాచ్మెన్, ఆటోడ్రైవర్పై తమకు అనుమానాలు ఉన్నాయని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. సూసైడ్ లెటర్లో హ్యాండ్ రైటింగ్ తమ పిల్లలది కాదని స్పష్టం చేశారు. ఇటీవల ఆటో డ్రైవర్ విషయంలో చిన్న ఘటన జరగ్గా తమ దృష్టికి వచ్చిందని, ఇది పక్కా హత్యేనని వారు మండిపడ్డారు. సుమారు 45 నిమిషాలపాటు రోడ్డుపైనే భీష్మించి కూర్చున్నారు. దీంతో రోడ్డుకు రెండు వైపులా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అయ్యింది. అధికారులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వినలేదు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. పోలీసులు చేసేదేం లేక వాహనాల రాకపోకలను మళ్లించారు.
కొనసాగుతున్న దర్యాప్తు
ఈ ఘటనపై పోలీసులు అనుమానాస్పద మృతికి కేసు నమోదు చేశారు. పట్టణంలోని సాయికృప డిగ్రీ కళాశాలలో కొనసాగుతున్న ఎస్సీ హాస్టల్లో ఆదివారం ఉదయం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విద్యార్థినులు కుటుంబ సభ్యులతోపాటు ప్రజాసంఘాల వారితో కలిసి హాస్టల్లో విచారణ చేపట్టారు. పోలీసుల సహకారంతో క్లూస్ టీం వివరాలను సేకరించింది. కాగా వార్డెన్, వాచ్మెన్, ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నారు. ఏరియా దవాఖానలో పోస్ట్మార్టం నిర్వహించారు. నివేదిక వస్తేనే విషయం తెలిసే అవకాశం ఉన్నది.మిన్నంటిన రోదనలు
ఇద్దరు విద్యార్థినుల విషాద ఘటనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. చేతికొచ్చిన పిల్లలు చనిపోయారనే వార్తను జీర్ణించుకోలేకపోయారు. అక్కడే కింద పడి గుండెలవిసేలా రోధించారు. గుండెలు బాదుకుంటూ తమ పిల్లలను పదేపదే తలచుకుంటూ బోరుమన్నారు. ఈ ఘటన అక్కడున్న వారిని కలచివేసింది. స్థానికులు సైతం కంటతడిపెట్టారు. విద్యార్థినుల శ్రద్ధాంజలి ఫ్లెక్సీని చూసి భవ్య తల్లి ఏడ్చిఏడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. మరోవైపు వైష్ణవికి తల్లి లేదు. చిన్నప్పుడే చనిపోయింది. తండ్రి దివ్యాంగుడు. తన తమ్ముడు సైతం ఆరేండ్ల క్రితమే చనిపోయాడు. ఒక్కగానొక్క కూతురు కూడా చనిపోవడంతో ఆ తండ్రికి కండ్లలో ఏడ్వడానికి నీళ్లు కూడా రావడంలేదు.
తోపులాటలో మహిళలకు గాయాలు
పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తుండటంతో హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టేందుకు కుటుంబ సభ్యులు, ప్రజాసంఘాల వారు బయలుదేరాయి. ఈ క్రమంలో పోలీసులు, మహిళల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు మహిళలకు గాయాలయ్యాయి. ప్రశాంత వాతావరణంలో ఆందోళన చేస్తున్న తమను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి రక్తమొచ్చేలా కొట్టారని మహిళలు ఆరోపించారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి ఏరియా దవాఖాన వద్దకు వచ్చి విద్యార్థినుల కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.