హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో ఓ ప్రయాణికుడి నుంచి 3.14 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకొన్నారు. పట్టుబడిన బంగారం విలువ రూ.కోటి 65 లక్షలు ఉంటుందన్నారు. దుబాయ్ నుంచి ఎయిరిండియా విమానంలో వస్తున్న ఓ ప్రయాణికుడు బంగారం స్మగ్లింగ్ చేస్తున్నట్టు అధికారులకు సమాచారం అందింది. శంషాబాద్ ఎయిర్పోర్టులో దిగగానే అతడిని తనిఖీ చేయటంతో కొవిడ్ టెస్టింగ్ కిట్ డబ్బాల్లో పాలిథిన్ కవర్లు చుట్టిన బంగారం కనిపించింది. రెండు ప్యాకెట్లలో బంగారు గొలుసులు, మరో రెండింటిలో బంగారం పేస్టు దొరికింది. దుబాయ్లో ఒక ప్రయాణికుడు తనకు ఈ కవర్ను ఇచ్చాడని, హైదరాబాద్కు చేర్చితే కొంత సొమ్ము ఇస్తాననటంతో తాను ఈ డబ్బాను తీసుకొచ్చానని పట్టుబడిన వ్యక్తి చెప్పినట్టు కస్టమ్స్ అధికారులు తెలిపారు. అతడిని అరెస్టు చేశామని, దర్యాప్తు కొనసాగుతున్నదని పేర్కొన్నారు.