హైదరాబాద్ : ఇప్పటికే పలు సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసుకుని, చివరి ఎకరా వరకు నీరందిస్తున్న తెలంగాణ సాగునీటి రంగంలో మరో ముందడుగు పడింది. మరో మూడు సాగునీటి ప్రాజెక్టులకు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(TAC) ఆమోదం తెలిపింది. ముక్తేశ్వర ఎత్తిపోతల పథకం(భూపాలపల్లి), ఛనాక కొరాట బ్యారేజీ(ఆదిలాబాద్), చౌటుపల్లి హనుమంతరెడ్డి ఎత్తిపోతల(నిజామాబాద్) పథకాలకు టీఏసీ ఆమోదం తెలిపింది. ప్రాజెక్టుల ఆమోదానికి సంబంధించి త్వరలోనే మినిట్స్ జారీ కానున్నాయి.
2021 సెప్టెంబర్లో కేంద్ర జలసంఘానికి, గోదావరి రివర్ బోర్డుకు ఈ ప్రాజెక్టుల డీపీఆర్లను ప్రభుత్వం అందజేసింది. ఈ మేరకు కేంద్ర జలసంఘంలో ఉన్న వివిధ డైరెక్టరేట్లు డీపీఆర్లకు ఆమోదం తెలిపారు. 3 ప్రాజెక్టులకు టెక్నో ఎకనామిక్ క్లియరెన్స్ ఇవ్వొచ్చని కేంద్ర జల సంఘం సిఫారసు చేసింది. టీఏసీ సమావేశంలో మూడు ప్రాజెక్టులపై వివరమైన చర్చ జరిగింది. టీఏసీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు సరైన సమాధానాలు ఇచ్చారు. ఈ సమాధానాలకు సంతృప్తి చెంది ఈ మూడు ప్రాజెక్టులకు ఆమోదం తెలుపనున్నట్టు టీఏసీ ఛైర్మన్ పంకజ్ కుమార్ ప్రకటించారు. త్వరలోనే మినిట్స్ జారీ చేస్తామన్నారు.
సమావేశంలో జల శక్తి మంత్రిత్వ శాఖ అడిషనల్ సెక్రెటరీ దేబశ్రీ ముఖర్జీ, కేంద్ర జల సంఘం ఛైర్మన్ ఆర్కే గుప్త, సభ్యులు చంద్రశేఖర అయ్యర్, రుష్విందర్ వోర, కేంద్ర జల సంఘం చీఫ్ ఇంజనీర్లు, పైథాంకర్, బీపీ పాండే, వివిధ విభాగాల డైరెక్టర్లు, ఆర్థిక, వ్యవసాయ, ఇంధన మంత్రిత్వ శాఖల ప్రతినిధులు పాల్గొన్నారు.
తెలంగాణ తరపున స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రజత కుమార్, ఇంజనీర్ ఇన్ చీప్లు సీ మురళీధర్, ఎన్ వెంకటేశ్వర్లు(రామగుండం), చీఫ్ ఇంజనీర్లు శ్రీనివాస్ (ఆదిలాబాద్), మధుసూధన్ (నిజామాబాద్ ), సీఎం ఒఎస్డీ శ్రీధర్ రావు దేశ్ పాండే పాల్గొన్నారు. తెలంగాణ మూడు ప్రాజెక్టులను ఆమోదించినందుకు కమిటీ ఛైర్మన్ పంకజ్ కుమార్కు, సభ్యులకు రజత్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.