హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. 31 కంపార్ట్మెంట్లు నిండిపోయాయని, టోకెన్లు లేని భక్తులకు 24 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. శనివారం స్వామివారిని 68,179 మంది భక్తులు దర్శించుకోగా 29,726 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ కానుకల ద్వారా రూ.3.06 కోట్ల రికార్డుస్థాయి ఆదాయం సమకూరిందని తెలిపారు. కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర షెకావత్ ఆదివారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ప్రధాని నరేంద్రమోదీ రెండు రోజుల పర్యటన కోసం సోమవారం తిరుమలకు రానున్నారు. ప్రధాని శ్రీరచనా గెస్ట్హౌజ్లో బస చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన శ్రీవారిని దర్శించుకోనున్నారు.
శ్రీశైలంలో భక్తుల రద్దీ
శ్రీశైలంలో కార్తీకమాస సందడి నెలకొన్నది. పవిత్ర సోమవారం దీపారాధన చేయడానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆదివారమే తరలివచ్చారు. గంగాధర మండపం, ఆలయ ఉత్తర మాఢవీధిలో దీపారాధన చేసి మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం 6 గంటలకు పాతాళగంగ వద్ద పుణ్యనదీ హారతి కార్యక్రమం నిర్వహించారు. రాత్రి 7 గంటలకు ఆలయం ముందు భాగంలోని గంగాధర మండపం వద్ద శ్రీ భ్రమరాంబ మల్లికార్జునస్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు జ్వాలాతోరణోత్సవం నిర్వహించారు.