Telangana | హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల అధికారులు, పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా పెద్దమొత్తంలో నగదు, బంగారం, మద్యం, విలువైన కానుకలు పట్టుబడుతున్నాయి. అక్టోబర్ 9 నుంచి శుక్రవారం రాత్రి వరకు జరిగిన తనిఖీల్లో పట్టుబడిన వాటి మొత్తం విలువ రూ. 286.74 కోట్లు దాటినట్లు అధికారులు తెలిపారు. గడిచిన 24 గంటల్లో రూ. 8 కోట్లకు పైగా నగదు, 38 కిలోల బంగారం, 189 కిలోల వెండి, 186 క్యారెట్ల వజ్రాలు, ఐదు గ్రాముల ప్లాటినం, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు.
అక్టోబర్ 9 నుంచి ఇప్పటి వరకు రూ. 96 కోట్ల నగదు పట్టుబడగా, స్వాధీనం చేసుకున్న బంగారం, ఆభరణాల విలువ రూ. 149.14 కోట్లు. దీంతో పాటు రూ. 12 కోట్ల విలువైన మద్యం, రూ. 9 కోట్ల విలువైన డ్రగ్స్, రూ. 19 కోట్లకు పైగా విలువైన ఇతర కానుకలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.