Diet Charges | హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థులకు చెల్లించాల్సిన మెస్, కాస్మోటిక్ చార్జీలను 26% మేరకు పెంచాలని మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విద్యార్థులకు మరింత మంచి భోజన వసతి కల్పించేందుకు చార్జీలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. దీంతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వెల్పేర్ శాఖలతోపాటు మాడల్, కస్తూర్బా పాఠశాలలు, గురుకులాలన్నీ కలుపుకొని మొత్తం 3,214 హాస్టళ్లలో ఉంటున్న దాదాపు 7.5 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనున్నది. ప్రభుత్వ నిర్ణయంపై విద్యార్థులు సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలివి
హాస్టళ్ల డైట్ చార్జీలను ప్రభుత్వం ఐదేళ్లకోసారి పెంచుతుంది. 2012లో ఉమ్మడి ప్రభు త్వం కేవలం 10% మేరకే పెంచగా, స్వరాష్ట్రం లో 2016-17లో ప్రభుత్వం ఆ చార్జీలను 25 %పెంచింది. చార్జీలను పెంచాలన్న ప్రతిపాదనలపై సీఎం ఇటీవల అసెంబ్లీలో సానుకూలంగా స్పందించారు. గత మార్చిలో మంత్రి హరీశ్రావు నేతృత్వంలో మంత్రులు గంగుల కమలాకర్, సత్యవతిరాథోడ్, ఆర్థికశాఖ కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర అధికారులు 26% మేరకు ధరలు పెంచాలని ప్రతిపాదనలు పంపగా, సీఎం ఆమోదించారు.
చార్జీలకు ఏటా 13 వేల కోట్లకుపైగా..
డైట్ చార్జీలను పెంచిన నేపథ్యంలో ఏటా అదనంగా భారీ నిధులను కేటాయించాల్సి ఉంది. ప్రతినెలా రూ.906.23 కోట్లను కేవలం డైట్చార్జీల కోసమే వెచ్చిస్తున్నది. పెంచిన డైట్ చార్జీలకు అనుగుణంగా ప్రభుత్వం ప్రతీ నెలా అదనంగా రూ.237.24 కోట్లు, ఏటా 2,846.88 కోట్లు అదనంగా వెచ్చించాల్సి వస్తున్నది. మొత్తంగా ఏటా డైట్ చార్జీల కోసం 13,721.64 కోట్లను కేటాయించాల్సి ఉన్నది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతల వెల్లువ
డైట్ చార్జీలు పెంచిన సీఎం కేసీఆర్కు మంత్రులు గంగుల, కొప్పుల, సత్యవతి కృతజ్ఞతలు తెలిపారు. హాస్టళ్ల విద్యార్థులకు మరింత నాణ్యమైన భోజనం వసతి సౌకర్యాలు సమకూరనున్నాయని టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. డైట్ చార్జీలు పెంచి సీఎం కేసీఆర్ మరోసారి మానవతా దృక్పథం చాటుకున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ కొనియాడారు. ఉమ్మడి రాష్ట్రంలో ధర్నా లు, రాస్తారోకోలు చేసినా రూ.50 కూడా పెంచలేదని, స్వరాష్ట్రంలో విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నారని బీసీ కమిషన్ సభ్యుడు కిశోర్గౌడ్ కొనియాడారు. సీఎం కేసీఆర్ విద్యార్థులను సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్గౌడ్ అన్నారు.