హైదరాబాద్, అక్టోబర్ 3 (నమస్తే తెలంగాణ): యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ గ్రామానికి చెందిన చేనేత కార్మికుడు దుస్స భిక్షపతికి ప్రభుత్వం సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.25 లక్షలు మంజూరు చేసింది. భిక్షపతికి ఇటీవల యాక్సిడెంట్ కావడంతో చికిత్స కోసం ఉన్న ఇంటిని తాకట్టు పెట్టారు. కొన్నాళ్లకు కాలేయం పాడవగా ఓ ప్రైవేటు దవాఖానలో చేర్చారు. కాలేయ మార్పిడి శస్త్రచికిత్సకు రూ.25 లక్షలు అవుతుందని డాక్టర్లు చెప్పడంతో ఆ కుటుంబం తమను ఆదుకోవాలంటూ చేనేత, జౌళిశాఖ మంత్రి కేటీఆర్కు విజ్ఞప్తి చేశారు. బిక్షపతికి ముగ్గురు కూతుళ్లు. ఎమ్మెల్యే గాదరి కిశోర్, టీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఎల్ రమణ ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో భిక్షపతికి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.25 లక్షలు మంజూరయ్యాయి. ఈ పత్రాన్ని ఎమ్మెల్యే గాదరి కిశోర్ ఆదివారం బాధిత కుటుంబానికి అందజేశారు. చేనేత కుటుంబాన్ని ఆదుకున్నందుకు సీఎం కేసీఆర్కు ఎల్ రమణ ధన్యవాదాలు తెలిపారు.