Mangapeta | హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): మంగపేట గడ్డ ముమ్మాటికీ ఆదివాసీల అడ్డా అని స్పష్టమైంది. మండలంలోని 23 గ్రామాలు షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకే వస్తాయని బుధవారం హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో అక్కడి ఆదివాసీల్లో హర్షాతిరేకాలు వ్యకమవుతున్నాయి. కోర్టు తీర్పుతో దశాబ్దాల కల సాకారమైందంటూ సంబురాలు చేసుకుంటున్నారు. రాజ్యాంగం తమకు కల్పించిన హక్కుకు ప్రభుత్వం రక్షణగా నిలవడంతోనే న్యాయం దక్కిందంటూ ప్రభుత్వానికి, న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా (ప్రస్తుతం ములుగు జిల్లా) మంగపేట మండలంలోని 23 గ్రామాల అడవి బిడ్డలు 1974 నుంచి న్యాయం కోసం పోరాడుతున్నారు. తెలంగాణ ఉద్యమం ఉవెత్తున ఎగసిపడుతున్న సమయంలో 2011లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడింది. అయితే, మంగపేటను షెడ్యూల్డ్ ఏరియాగా ప్రకటించే వరకు ఎన్నికలు నిర్వహించకూడదని కోర్టును ఆశ్రయించడంతో స్టే ఇచ్చింది. అప్పటి నుంచి మంగపేటలోని గ్రామ, మండల స్థానిక సంస్థల్లో ప్రత్యేక అధికారుల పాలనే కొనసాగుతున్నది. ఇప్పుడు న్యాయస్థానం తీర్పుతో మండలంలోని 14 ఎంపీటీసీ స్థానాలు, మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగి ప్రజాపాలనకు మార్గం సుగమమైంది.
సాక్ష్యాలు ఇవిగో
అప్పటి హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం 1359 ఫస్లీ (నవంబర్ 16, 1949) రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాలను నోటిఫై చేసింది. ఈ నోటిఫికేషన్ను 4 ఫిబ్రవరి 1950న ఢిల్లీకి పంపింది. దీంతో అభ్యంతరాలు కోరుతూ కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం పాల్వంచ, బూర్గంపహాడ్, అశ్వారావుపేట, దమ్మపేట, కుకునూరు, నెల్లిపాక తదితర ప్రాంతాలను హైదరాబాద్ స్టేట్ గిరిజన ప్రాంతాలని వెల్లడించింది. అప్పుడు పాల్వంచ తాలూకా పరిధిలో ఉన్న మంగపేట (ప్రస్తుత ములుగు జిల్లా) మండలంలోని 23 గ్రామాలను ఆ తరువాత రాజ్యాంగంలోని షెడ్యూల్డ్ ఏరియాలో (పార్ట్-బీ)లో భాగమని తేల్చింది. అయితే, 1/70 చట్టం అమల్లోకి వచ్చిన తరువాత 1973, 1974లలో కోయబ్రహ్మానందం సహా 130 మంది మంగపేట షెడ్యూల్ ప్రాంతం కాదని కేసు వేశారు. దీనికి ఏజెన్సీ నిబంధనలు వర్తించని అనేకమంది గిరిజనేతరులు వాదించారు. అప్పటి 1/70 చట్టం పరిధిలో మంగపేట ఉందని వాదించేందుకు గిరిజనుల దగ్గర ఆధారాలు (డాక్యుమెంటరీ ఎవిడెన్స్) లేకపోవటంతో మంగపేట గిరిజనేతర ప్రాంతమేనని 1974లో కోర్టు తీర్పునిచ్చింది. అప్పటి నుంచి 2006 వరకు మంగపేట, మంగపేట పరిధిలో గ్రామ పంచాయతీ ఎన్నికలు జనరల్గా (నాన్ ఏజెన్సీగా) జరిగేవి.
మంగపేట ఏజెన్సీ ఎందుకు కాదు?
2006లో సర్పంచ్ ఎన్నికల సమయంలో మంగపేట చుట్టూ ఉన్నది ఏజెన్సీ ప్రాంతం అయితే మంగపేట ఎందుకు కాకుండా పోతుందని ఆదివాసీ బిడ్డలు, అప్పటి అధికారులు పాత రికార్డులను పరిశీలించి దాన్ని షెడ్యూల్ ఏరియాగా పరిగణించారు. మండలంలోని 18 గ్రామ పంచాయతీలను ఎస్టీ రిజర్వ్ చేస్తూ ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ జారీ కావడంతో గిరిజనేతరులు మరోమారు కోర్టును ఆశ్రయించారు. నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత రద్దు చేయలేమని కోర్టు చెప్పడంతో అప్పుడు ఎన్నికలు జరిగాయి. 2011లో మంగపేటను షెడ్యూల్డ్ ఏరియాగా పేర్కొంటూ ఎన్నికల నోటిఫికేషన్ జారీ కాగా గిరిజనేతరులు మరోమారు కోర్టుకెక్కారు. అప్పట్లో సరైన ఆధారాలు సమర్పించకపోవడం వల్లే గిరిజనులకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. ఈసారి వాస్తవిక ఆధారాలను పరిశీలించిన కోర్టు గిరిజనులకు అనుకూలంగా తీర్పుచెప్పింది. దీనిపైనా గిరిజనేతరులు కోర్టును ఆశ్రయించారు. ఈసారి ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఆదివాసీలకు అండగా నిలిచింది. వరంగల్ ఉమ్మడి జిల్లా కలెక్టర్లుగా, పీవో ఐటీడీఏ అధికారులు, ములుగు ఆర్డీవోలుగా, గిరిజన సంక్షేమశాఖ ఉన్నతాధికారులుగా వ్యవహరించిన పలువురు మంగపేట షెడ్యూల్డ్ ఏరియా పరిధిలోకి వస్తుందనే ఆధారాలను సేకరించారు.
స్వరూపం మారలేదు: హైకోర్టు
హైకోర్టు తన తాజా తీర్పులో.. మంగపేట మండలంలోని 23 రెవెన్యూ గ్రామాలు రాజ్యాంగానికి పూర్వకాలం నుంచి షెడ్యూలు ప్రాంతంలో ఉన్నాయని గుర్తు చేసింది. వాటని రద్దు చేస్తూ ప్రభుత్వం కూడా చట్టాలు చేయలేదని స్పష్టం చేసింది. ఏజన్సీ ప్రాంతంలోని ఈ గ్రామాలు తాలూకాల పునర్విభజనలో భాగంగా ఏజన్సీ ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీ అయ్యాయేగానీ వాటి స్వరూపాన్ని మార్చలేదని తెలిపింది. సరిహద్దులు మారడం తప్ప హోదా మారలేదన్న రాష్ట్ర ప్రభుత్వ వాదననను ఆమోదిస్తూ తీర్పు చెప్పింది.