హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యారంగం అభివృద్ధిపై కేంద్రం వివక్ష ప్రదర్శిస్తున్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి విమర్శించారు. గత తొమ్మిదేండ్లలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఇవ్వలేదని, కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ స్కూళ్లు, గిరిజన వర్సిటీలను మంజూరు చేయకుండా పక్షపాత ధోరణి చూపుతున్నదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తెలంగాణ విద్యా దినోత్సవాన్ని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి గుత్తా సుఖేందర్రెడ్డితోపాటు మంత్రులు తలసాని శ్రీనివాస్యాదవ్, మహమూద్ అలీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం కొర్రీలు పెడుతున్నా సీఎం కేసీఆర్ పట్టుదలతో విద్యారంగం అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు. మాడల్స్కూళ్ల నిర్వహణపై కేంద్రం చేతులెత్తేసిందని, రాష్ట్రంలోని 194 మాడల్స్కూళ్లను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తున్నదని చెప్పారు.ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదు రంగాలకు ప్రాధాన్యం ఇచ్చారని, విద్య, వైద్యం, వ్యవసాయం, విద్యుత్తు, పారిశ్రామిక రంగాల్లో రాష్ట్రం అద్భుత ప్రగతిని సాధించి మొదటి స్థానంలో ఉన్నదని గుత్తా వివరించారు. గురుకులాల్లో సీట్ల సిఫారసు కోసం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వద్దకు విద్యార్థుల తల్లిదండ్రులు వస్తుండటం ఆయా సంస్థల అద్భుత పనితీరుకు నిదర్శనమని చెప్పారు.
హైదరాబాద్ అభివృద్ధి అద్భుతం
బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి ప్రశంస
హైదరాబాద్ నగరాన్ని రాష్ట్ర ప్రభుత్వం అద్భుతంగా అభివృద్ధి చేసిందని బీజేపీకి చెందిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి ప్రశంసించారు. రాష్ట్ర ప్రభుత్వం రహదారులు, అండర్పాస్లు, ఫె్లైఓవర్లను అద్భుతంగా నిర్మించిందని కితాబిచ్చారు. సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్మారకాలను నిర్మించడం ప్రశంసనీయమని చెప్పారు. డాక్టర్లు, ఇంజినీర్లు తయారు కావాలంటే పాఠశాల విద్య పునాది వంటిదని, మనఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మన ఊరు-మన బడి కార్యక్రమంలో పాఠశాల విద్యాశాఖ అదనపు డైరెక్టర్ గాజర్ల రమేశ్ రచించి, ఆలపించిన గీతాలు సభికులను ఆకట్టుకున్నాయి.
విద్యారంగంపై ఏటా 23 వేల కోట్లు: సబితారెడ్డి
విద్యారంగంపై గత ప్రభుత్వాలు ఏటా రూ.8 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేస్తే, తెలంగాణ ప్రభుత్వం రూ.23 వేల కోట్లకు పైగా వెచ్చిస్తున్నదని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి తెలిపారు. దీనిని ఖర్చుగా భావించడంలేదని, భావితరాలపై పెట్టుబడిగా భావిస్తున్నామని పేర్కొన్నారు. గతంలో ఎన్నడూలేని విధంగా పాఠశాలలు ప్రారంభమైన రోజే యూనిఫారం, పాఠ్యపుస్తకాలు అందజేస్తున్నామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ ఏడాది నుంచి ఉచితంగా నోట్బుక్స్, వారంలో మూడు రోజులపాటు విద్యార్థులకు రాగిజావ అందజేస్తున్నామని చెప్పారు. పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో విద్యకు బంగారు బాటలు వేశామని పేర్కొన్నారు. దొడ్డు బియ్యం స్థానంలో సన్న బియ్యంతో విద్యార్థులకు కడుపునిండా భోజనం పెడుతున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. హోంశాఖ మంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ..విద్య లేకపోతే అభివృద్ధి లేదని, ఈ కారణంగా సీఎం కేసీఆర్ విద్యకు అధిక ప్రాధాన్యం ఇచ్చారని పేర్కొన్నారు. మన ఊరు-మనబడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వం పాఠశాలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నదని చెప్పారు. గతంలో తెలంగాణలో మైనారిటీ గురుకులాలు 12 మాత్రమే ఉండేవని, ముఖ్యమంత్రి కేసీఆర్ వీటిని 204కు పెంచారని వివరించారు.
ఉత్తమ గురువులకు సన్మానం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, విద్యాశాఖ అధికారులు పాల్గొని విద్యార్థులకు యూనిఫాం, నోట్ పుస్తకాలు, రాగి జావ పంపిణీ చేశారు. వివిధ పాఠశాలల్లో ఉత్తమ సేవలందించిన ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలను అందజేశారు. జిల్లెలగూడ చల్లా లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన ఉత్సవాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. పదవ తరగతిలో పది జీపీఏ సాధించిన విద్యార్థులను సత్కరించి రూ.10వేల చొప్పున బహూకరించారు. మేడిపల్లి జడ్పీ ప్రాథమికోన్నత పాఠశాలలో నిర్మించిన అదనపు గదులను మంత్రి సీహెచ్ మల్లారెడ్డి ప్రారంభించారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం చించోలి(బి)లో మైనారిటీ గురుకులంతోపాటు రాంనగర్, సోఫీనగర్, సారంగాపూర్లో కొత్తగా నిర్మించిన ప్రాథమిక పాఠశాల భవనాలను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ జడ్పీహెచ్ఎస్లో నిర్వహించిన విద్యాదినోత్సంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ విద్యార్థిని చెప్పిన సోదికి మంత్రముగ్ధుడైన స్పీకర్ ఆ బాలికకు రూ.1,000 నగదును బహూకరించి, సన్మానించారు. ఖమ్మంలో ఆధునికీకరించిన పలు ప్రభుత్వ పాఠశాలలను మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రారంభించారు. వనపర్తిలోని బండారునగర్ ఇంగ్లిష్ మీడియం ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం పాఠశాల, కేడీఆర్లోని మండల ప్రాథమిక పాఠశాలను మంత్రి నిరంజన్రెడ్డి ప్రారంభించారు. నల్లగొండలో టీఎల్ఎం మేళాను మంత్రి జగదీశ్రెడ్డి ప్రారంభించారు. జనగామ జిల్లా పాలకుర్తి లో మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన బాలుర డిగ్రీ కళాశాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు.
సిద్దిపేట, జూన్ 20 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): గత పాలకులు 20 ఏండ్లకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటుచేస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క విద్యా సంవత్సరంలోనే తొమ్మిది మెడికల్ కాలేజీలను ప్రారంభించారని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్ష్హాల్లో నిర్వహించిన విద్యా దినోత్సవంలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు ఉక్రెయిన్, రష్యా, చైనా వంటి దేశాలకు వెళ్లి, వ్యయ, ప్రయాసలకోర్చి చదువుకొన్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఉక్రెయిన్లో యుద్ధ్దం వస్తే మన పిల్లలు ఆగమై, సగం చదువులు వదులుకొని వచ్చారని గుర్తుచేశారు. గత పాలకులు వైద్య కళాశాలలు పెట్టి ఉంటే మన పిల్లలు ఉక్రెయిన్కు పోవాల్సిన అవసరం వచ్చేది కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి కేవలం 5 మెడికల్ కాలేజీలు ఉండేవని, కేసీఆర్ పాలనలో 21 మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నామని వివరించారు. నేడు తెలంగాణలో 8,340 మెడికల్ సీట్లు అందుబాటులోకి ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి 10/10 జీపీఏ సాధించిన 126 మంది విద్యార్థులకు ఐప్యాడ్లు, వందశాతం ఉత్తీర్ణత సాధించిన 219 ప్రభుత్వ పాఠశాలలకు ఒక్కో దానికి రూ.25 వేలు, వందశాతం ఫలితాలు సాధించిన 8 మండలాలకు ఒక్కోదానికి రూ.50 వేల చొప్పున అందజేశారు.