హైదరాబాద్, సెప్టెంబర్ 9 (నమస్తే తెలంగాణ): ఇటీవల పది రోజులపాటు ఎడతెరిపిలేకుండా కురిసిన వర్షాలకు రాష్ట్రంలో 2,226.63 కిలోమీటర్ల రహదారులు దెబ్బతిన్నాయి. రోడ్లపై తారు కొట్టుకుపోగా.. కొన్నిచోట్ల కోతకు గురయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లాలో 268.98 కిలోమీటర్ల రోడ్లు కొట్టుకుపోయాయి. ఈ మేరకు రోడ్లుభవనాల శాఖ అధికారులు అంచనాలు రూపొందిస్తున్నారు. వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లకు సంబంధించి ఆర్అండ్బీ అధికారులు జిల్లాల నుంచి అంచనాలు తీసుకుని.. నివేదిక తయారు చేస్తున్నారు.
జగిత్యాల జిల్లాలో 246.05, భద్రాద్రి కొత్తగూడెంలో 223.90, నాగర్ కర్నూల్లో 253 కిలోమీటర్ల మే9ర రోడ్లు దెబ్బతిన్నాయి. వీటితోపాటు 11,256.52 రన్నింగ్ మీటర్ల రోడ్లకు బుంగలు, గుంతలు పడ్డాయి. 1,03,894.20 రన్నింగ్ మీటర్ల మేర రోడ్లఅంచులు దెబ్బతిన్నాయి. చిన్న చిన్న వాగులు, వంకలన్నీ ఉప్పొంగడంతో వాటి పరిధిలోని కాజ్వేలపైకి భారీ ఎత్తున వరదనీరు చేరింది. దీంతో 651 కల్వర్టులు దెబ్బతిన్నాయి. వరద ప్రవాహానికి దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిల మరమ్మతులకు రోడ్లు భవనాలశాఖ 357.312 కోట్లతో అంచనాలు రూపొందించింది.
ఈ మేరకు అన్నిజిల్లాల నుంచి సమగ్ర సమాచారం తెప్పించిన అధికారులు నివేదికను తయారుచేస్తున్నారు. వెంటనే మరమ్మతులు చేపట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాకాల సీజన్ ఆరంభంలోనే జూన్ నుంచి జూలై చివరి వరకు కురిసిన వర్షాలతో 2,351 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతిన్నాయి. వీటి మరమ్మతులకు రూ.288.553 కోట్లు అవసరం అవుతాయని ఆర్అండ్బీ శాఖ అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించింది.