సిరిసిల్ల అంటేనే ఉరిసిల్ల అని కవుల కలాలు కన్నీరు కార్చిన రోజులు అవి. నూలు పోగునే ఉరితాళ్లుగా మార్చుకొని చావును కోరుకున్న బతుకులు అవి.. చేతిలో పనిలేక సాంచెలపైనే తనువు చాలించిన జీవితాలు అవి.. ఒక్కరా, ఇద్దరా.. వందల మంది నేతన్నలను బలి తీసుకొన్న పరిస్థితులు ఆనాటివి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! తెలంగాణ వచ్చింది.. టీఆర్ఎస్ సర్కారు కొలువుదీరింది. సిరిసిల్ల గడ్డ మీది నుంచి గెలిచిన కేటీఆర్.. ఎనిమిదేండ్ల పొద్దులో సిరిగల్ల జిల్లాగా మార్చేశారు. సంక్షేమ తారక మంత్రంతో నేతన్నల జీవితాల్లో ఆసు పోశారు.
రాజన్న సిరిసిల్ల, జూన్ 1 (నమస్తే తెలంగాణ): ‘నేతన్నా.. ఆత్మహత్య చేసుకోకు, అండగా మేమున్నాం’ అంటూ గోడలపై పోలీసులు రాసిన రాతలకు ఉద్యమ సారథి కే చంద్రశేఖర్రావు చలించిపోయారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని, అండగా నేనున్నానని ముందుకొచ్చారు. ఉద్యమ సమయంలోనే సిరిసిల్లను సందర్శించిన ఆయన టీఆర్ఎస్ తరఫున రూ.50 లక్షలు నేతన్నల సంక్షేమ ట్రస్టుకు అందజేశారు. స్వరాష్ట్రం సాధించుకొన్నాక మీ బతుకులను మారుస్తానని ఇచ్చిన మాటను తప్పకుండా నేతన్నల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు.
2009 నుంచి సిరిసిల్ల ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించిన కే తారకరామారావు స్థానిక సమస్యలను తెలుసుకొన్నారు. నేత కార్మికుల దుస్థితిని అర్థం చేసుకొన్నారు. తెలంగాణ వచ్చాక చేనేత, జౌళీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి సిరిసిల్ల రూపురేఖలనే మార్చేశారు. పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన మరమగ్గాల పరిశ్రమకు రూ.కోట్ల విలువైన బతుకమ్మ చీరలు, రంజాన్, క్రిస్మస్ వస్త్ర ఆర్డర్లు ఇచ్చి ఆదుకొన్నారు. ఫలితంగా ఇప్పుడు రూ.2 వేల కోట్ల విలువైన వస్త్ర ఆర్డర్లు నేతన్నల చేతుల్లో ఉన్నాయి. చేతి నిండా పని, నెలకు రూ.20 వేలకుపైగా వేతనం అందుతున్నది. ప్రపంచంలోనే ఎక్కడాలేని విధంగా కార్మికుడినే యజమానిని చేసే వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టిన ఘనత రామన్నకే దక్కిందంటూ నేతన్నలు వేనోళ్ల కొనియాడుతున్నారు.
కార్మికుల దయనీయ పరిస్థితి, పరిశ్రమ సంక్షోభాన్ని దృష్టిలో పెట్టుకొని మంత్రి కేటీఆర్ చేనేత, మరమగ్గాలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేయించారు. ఈ రెండు పరిశ్రమల అభివృద్ధికి బడ్జెట్లో రూ.1,200 కోట్లు కేటాయించారు. ప్రభుత్వం మరమగ్గాలు, చేనేత కార్మికులకు రైతు బీమా మాదిరిగా ‘నేతన్నకు బీమా’ 9పథకాన్ని ప్రవేశపెట్టింది. కార్మికుడు మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందేలా ఎల్ఐసీ ద్వారా బీమా చేయించింది. అందుకు రూ.29.98 కోట్లు కేటాయించింది.
ఈ పథకం మే నుంచి అమల్లోకి వచ్చింది. ఈ పథకం రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మందికిపైగా వర్తించనున్నది. కార్మికుడు సంపాదించిన కూలీ డబ్బులు పొదుపు చేసుకొనేందుకు ‘త్రిపు’్ట పథకాన్ని ప్రవేశపెట్టింది. కార్మికుడు చేసిన 8 శాతం పొదుపులో మరో 8 శాతం ప్రభుత్వం జమ చేస్తుంది. నిధులను రూ.12 కోట్ల నుంచి రూ.18 కోట్లకు పెంచింది. ఈ పథకానికి మూడేండ్ల కాల పరిమితి ఉండగా, కరోనా ఆపత్కాలంలో రెండున్నరేండ్లకే ప్రభుత్వం కార్మికులకు పూర్తి స్థాయిలో డబ్బులు చెల్లించి ఆదుకొన్నది. పొదుపు పథకంలో చేరిన కార్మికులు రూ.70 వేల నుంచి రూ.లక్ష వరకు లబ్ధి పొందారు.
సిరిసిల్లలోని పాతకాలపు మరమగ్గాలను ప్రభుత్వం ఆధునీకరించింది. అందులో భాగంగా మాలేగావ్, నాగపూర్, ఇచ్చల్కరంజీ, సూరత్, భీవండీ, తమిళనాడులోని ఆధునిక మరమగ్గాలు, అక్కడి వస్త్ర ఉత్పత్తుల పరిశీలనకు సిరిసిల్ల కార్మికులు, యజమానులు, ఆసాములను ప్రభుత్వం తన సొంత ఖర్చులతో స్టడీ టూర్కు పంపింది. నాణ్యమైన వస్త్ర ఉత్పత్తులు తయారుచేసేందుకు రూ.11.06 కోట్లతో 10,849 మరమగ్గాలను ఆధునీకరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నేత కార్మికులు బ్యాంకుల్లో తీసుకొన్న రూ.లక్ష రుణాన్ని మాఫీ చేసింది. ఒక్క సిరిసిల్ల కార్మికులకే రూ.3.50 కోట్లు మాఫీ అయ్యాయి.
ప్రపంచ చరిత్రలో ఎక్కడాలేని విధంగా కార్మికుడినే యజమానిగా మార్చాలన్నది మంత్రి కేటీఆర్ సంకల్పం. సిరిసిల్ల పట్టణంలోని పెద్దూరు శివారులో 85 ఎకరాల స్థలంలో సుమారు రూ.250 కోట్ల అంచనాతో వర్కర్ టు ఓనర్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇందులో ప్రభుత్వమే షెడ్డు నిర్మించి ఇస్తుంది. ప్రతి కార్మికుడికి 4 సాంచెలను కొనుగోలు చేసి అందిస్తుంది. మొదటి విడతలో 1,100కు పైగా కార్మికులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. త్వరలో అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకొంటున్నది.
మరమగ్గాల పరిశ్రమకు కేంద్రబిందువైన సిరిసిల్ల నేడు గార్మెంట్ రంగం వైపు అడుగులేస్తున్నది. మంత్రి కేటీఆర్ చొరవతో గార్మెంట్ పరిశ్రమలు సిరిసిల్లకు తరలి వస్తున్నాయి. ఇప్పటికే టెక్స్టైల్స్ పార్కు రాష్ట్రంలోనే తొలి పార్కుగా అభివృద్ధి పరుగులు పెడుతున్నది. అన్ని రకాల వస్త్ర ఉత్పత్తులు ఇక్కడే జరిగేలా కేటీఆర్ కృషి చేస్తున్నారు. పెద్దూరు శివారులో 85 ఎకరాలలో అప్పారెల్ పార్కు ఏర్పాటు చేశారు.
ఇందులో ఇప్పటికే గోకుల్దాస్ అండ్ కంపెనీ, టెక్స్పోర్ట్ ఇండియా గార్మెంట్ పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. 15 వేల మంది మహిళలకు ఉపాధి కల్పించేలా పార్కును అభివృద్ధి చేస్తున్నారు. బీడీ కార్మికులకు, మధ్యమానేరు నిర్వాసిత మహిళలకు ఉపాధి కల్పించేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. గోకుల్దాస్ కంపెనీలో ప్రస్తుతం 67 బ్యాచ్ల ద్వారా 2,085 మంది మహిళలు జూకీ కుట్టుమిషన్లపై శిక్షణ పొందారు. వీరు నెలకు రూ.10 వేలకు పైగా జీతం పొందేలా మంత్రి కేటీఆర్ చర్యలు తీసుకొంటున్నారు.