మెదక్, డిసెంబర్ 24: యాసంగి వచ్చిందంటే ఆ ఊరంతా ఉల్లి సాగులో మునిగిపోతుంది. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా 200 కుటుంబాలు ఉల్లినే సాగు చేస్తాయి. పెట్టుబడి తక్కువ, దిగుబడి ఎక్కువ ఉండటంతో అక్కడి రైతులు ఉల్లినారునే వేస్తున్నారు. మెదక్ జిల్లా మక్తభూపతిపూర్లో 456 కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడి రైతులు యాసంగిలో సంప్రదాయ పంటలను పండించరు. తక్కువ విస్తీర్ణం, తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే కూరగాయల పంటలను పండిస్తున్నారు. డిమాండ్ ఉండే కూరగాయలు, ఆకుకూరలే లాభం తెచ్చిపెడతాయని ఇక్కడి రైతులు అంటారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఉల్లిని దాదాపు అందరు రైతులు సాగుచేస్తారు. రైతులే ఉల్లినారు, ఆకుకూరలు, కూరగాయలు మెదక్ పట్టణానికి తీసుకొని వచ్చి అమ్ముతుంటారు. టమాట, బెండ, వంకాయ, మిరప, క్యాబేజీ, తోటకూర, పాలకూర, గోంగూర కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు.
25 ఏండ్లుగా
గ్రామంలోని మొత్తం కుటుంబాల్లో 200 కుటుంబాలు ఉల్లినారు సాగుతోనే ఉపాధి పొందుతున్నాయి. 25 ఏండ్లుగా ఉల్లినే సాగు చేస్తున్నారు. కిలో విత్తనాలకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేలు ఖర్చు అవుతుంది. విత్తనాలు నాటాక, 45 రోజులకే పంట చేతికి వస్తుంది. తక్కువ సమయంలో, ఎక్కువ లాభం వస్తుండటంతో అక్కడి రైతులంతా ఈ పంటవైపు దృష్టిపెట్టారు. ఈ పంటను అరెకరం నుంచి ఎకరం భూమిలో సాగు చేస్తూ, రెండు నెలల్లోనే రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షల వరకు లాభాలు
ఆర్జిస్తారు.
పెట్టుబడి తక్కువ
ఉల్లినారుకు అయ్యే పెట్టుబడి చాలా తక్కువ. పైగా ఎరువులు, రసాయనిక మందుల అవసరం ఉండదు. మార్కెట్ డిమాండ్ను బట్టి ఉల్లి నారు సాగు చేస్తే లాభాల్లో దీన్ని మించిన పంట లేదు.
-బయ్య నర్సింలు
ఫోన్ నంబర్: 9908272218
తక్కువ సమయంలో లాభం
ఉల్లినారు, ఇతర ఆకు కూరలు తక్కువ సమయంలో చేతికి వస్తాయి. ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ. వీటితో ఏ రోజుకారోజు సంపాదన ఉంటుంది. వానకాలంలో వరి వేస్తే పెట్టుబడి పోగా వచ్చేది చాలా తక్కువ. యాసంగిలో ఉల్లినారుతో ఆధిక లాభం వస్తున్నది.