Hare Krishna tower | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు తలమానికంగా నిలిచేలా ఐటీ కారిడార్లో హరే కృష్ణ హెరిటేజ్ టవర్ను నిర్మించనున్నట్టు హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షుడు సత్య గౌర చంద్ర దాస తెలిపారు. ఈ నెల 8న సీఎం కే చంద్రశేఖర్రావు దీనికి భూమి పూజ చేస్తున్నారని వెల్లడించారు. శుక్రవారం కోకాపేటలో మీడియా సమావేశంలో హెరిటేజ్ టవర్ నిర్మాణ వివరాలను ఆయన వివరించారు. ఐటీ కారిడార్లోని భారీ బిల్డింగుల మధ్య హైదరాబాద్కు సాంస్కృతిక మైలురాయిగా నిలిచేలా కోకాపేట-నార్సింగి ప్రాంతాల మధ్య ఉన్న గోష్పాద క్షేత్రంలో 6 ఎకరాల్లో 40 అంతస్థుల్లో (120 మీటర్ల ఎత్తు) నిర్మిస్తామని తెలిపారు. ఇందుకు రూ.200 కోట్లు వెచ్చిస్తున్నామని, ఐదేండ్లలో పూర్తయ్యేలా కార్యాచరణ రూపొందించామని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో, శ్రీకృష్ణ గోసేవ మండలి విరాళంతో ఈ ప్రాజెక్టును చేపట్టామని వివరించారు. యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సీఎం కేసీఆర్ అత్యద్భుతంగా పునర్నిర్మించారని, ఆ స్ఫూర్తితోనే హెరిటేజ్ టవర్ నిర్మాణానికి డిజైన్ చేశామని తెలిపారు. కాకతీయ, చాళుక్య, ద్రవిడ, ఇతర పురాతన నిర్మాణ శైలుల్లో వైవిధ్యాలను సంతరించుకొనేలా తెలంగాణ చారిత్రక వారసత్వానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్టు వెల్లడించారు. రాధాకృష్ణ ఆలయం, శ్రీనివాసగోవిందుడి ఆలయం, లైబ్రరీ, మ్యూజియం, మల్టీ విజన్ థియేటర్, ఉచిత అన్నదాన సత్రం వంటివి ఉంటాయని పేర్కొన్నారు. సమావేశంలో హరే కృష్ణ మూవ్మెంట్ ఉపాధ్యక్షుడు యజ్ఞేశ్వర దాస ప్రభు, మహావిష్ణు దాస, సీఈవో కౌంతేయ దాస పాల్గొన్నారు.