హైదరాబాద్, డిసెంబరు 18 (నమస్తే తెలంగాణ): వీధి వ్యాపారులకు రెండోదశలో రెండు లక్షల మందికి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటిదశలో రూ.10 వేల రుణం తీసుకొని చెల్లించిన వారికి రెండో విడతలో రూ.20 వేల వరకు రుణం ఇప్పించాలని తీర్మానించింది. మొదటిదశ రుణాల్లో భాగంగా దేశంలోనే అత్యధికంగా రుణాలు పంపిణీ చేసి తెలంగాణ రికార్డును సాధించింది. మొదటిదశలో 3.47 లక్షల మందికి రూ.345 కోట్ల రుణాన్ని అందించారు. ఆ రుణాలను చెల్లించినవారు రెండోదశలో రూ.20 వేల వరకు రుణానికి మున్సిపల్ శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. వీధి వ్యాపారులు మీసేవ కేంద్రాల్లో, మున్సిపల్ కార్యాలయాల్లో, ఫోన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వెసులుబాటు కల్పించారు.