Congress | హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ‘మూడు కోట్ల మేటి ప్రజల గొంతొక్కటి కోరికొక్కటి. తెలంగాణ వెలసి నిలిచి ఫలించాలె భారతాన’ అన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు పలుకులతో గవర్నర్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఇటీవల ఎన్నికల్లో విజయం సాధించి, బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. అనుభవంతో కూడిన మంత్రివర్గం యువత సారథ్యంలో కొలువుదీరిందని వెల్లడించారు. మార్పు దిశగా ప్రభుత్వం పనిచేస్తుందని, ఇప్పటికే ఫలాలు మొదలయ్యాయని చెప్పారు. సీఎంగా బాధ్యతలు చేపట్టగానే రేవంత్రెడ్డి ఆరు గ్యారెంటీల అమలు ఫైల్పై సంతకం చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే రెండు గ్యారెంటీలను అమల్లోకి తెచ్చారని వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితిని రూ.10 లక్షలకు పెంచారని చెప్పారు. కొత్త ఏడాదిలో రైతులు, యువ త, మహిళలు, పేదల జీవితాల్లో మరిన్ని వెలుగులు నింపుతామని తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళి అర్పిస్తున్నట్టు పేర్కొన్నారు.
ప్రతి హామీ నెరవేర్చుతాం
మ్యానిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని గవర్నర్ స్పష్టం చేశారు. ఆరు గ్యారెంటీలను 100 రోజుల్లో అమలు చేసేందుకు కార్యాచరణ తీసుకుంటామని అన్నారు. రైతు, యువ, ఎస్సీ-ఎస్టీ, బీసీ డిక్లరేషన్లను అమలు చేస్తామని తెలిపారు. ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. మెగా డీఎస్సీ నిర్వహించి, ఆరు నెలల్లో ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని వివరించారు. అమరవీరుల కుటుంబాలను త్వరలో గుర్తించి, ఇంటి స్థలం, పెన్షన్ అంజేస్తామని అన్నారు. ప్రతి పంటకు మద్దతు ధర కల్పిస్తామని, రూ.2 లక్షల రుణమాఫీపై త్వరలో కార్యాచరణ ఉంటుందని వెల్లడించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధించాలన్నది తమ సంకల్పమని స్పష్టం చేశారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును పూర్తిచేస్తామని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇల్లు లేనివారికి ఇంటి స్థలం, స్థలం ఉన్నవారికి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల సాయం అందించడానికి త్వరలో కార్యాచరణ ప్రారంభిస్తామని చెప్పారు. ‘
ఎస్సీ, ఎస్టీలకు రూ.లక్ష అదనంగా సాయం అందిస్తాం. గతంలో పేదలకు పంచిన 25 లక్షల ఎకరాల భూమిపై పేదలకు పూర్తి స్థాయి భూ హక్కులు కల్పిస్తాం. ధరణి స్థానంలో భూమాత పోర్టల్ను తేవడానికి త్వరలో కార్యాచరణ మొదలవుతుంది. డ్రగ్స్ మాఫియాను నిర్మూలించే దిశగా చర్యలు మొదలుపెట్టాం. రాష్ట్రంలో అభివృద్ధిని వికేంద్రీకరిస్తాం. హైదరాబాద్ కేంద్రంగా రాష్ర్టాన్ని మూడు జోన్లుగా.. ఔటర్ లోపల, ఔటర్ నుంచి రీజినల్ రింగ్రోడ్డు మధ్య, రీజినల్ రింగురోడ్డు అవతల ప్రాంతాలుగా విభజిస్తాం. దానికి తగట్టుగా అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తాం’ అని వివరించారు. ‘ప్రజాస్వామ్యం అనేది ఒక ప్రభుత్వ పాలన రూపం మాత్రమే కాదు, అది తోటి మానవుల పట్ల గౌరవాదరణలతో కూడిన ఒక వైఖరి’ అని అంబేద్కర్ చెప్పిన విషయాలను గుర్తుచేశారు. తమ ప్రభుత్వం మాటల కన్నా చేతలనే ఎక్కువగా నమ్ముకున్నదని పేర్కొన్నారు.
21 నిమిషాల పాటు గవర్నర్ ప్రసంగం
ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించేందుకు శాసనసభకు వచ్చిన గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్కు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ ప్రసాద్కుమార్, సీఎం రేవంత్రెడ్డి, శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్బాబు స్వాగతం పలికారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సభలోకి వచ్చిన గవర్నర్ను చైర్మన్, స్పీకర్ కలిసి స్పీకర్ చైర్ వద్దకు తీసుకెళ్లారు. జాతీయ గీతాలాపన అనంతరం 11.32 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగాన్ని ప్రారంభించారు. 18 పేజీల ప్రసంగాన్ని చదివేందుకు 21 నిమిషాల సమయం తీసుకున్న గవర్నర్.. తన ప్రసంగాన్ని 11.55 గంటలకు ముగించారు. ప్రసంగం చివర్లో ప్రముఖ కవి దాశరథి రచించిన ‘ఆ చల్లని సముద్ర గర్భం’ గేయాన్ని చదివేందుకు తొలుత తడబడ్డారు. ఆ తర్వాత పలువురు సభ్యుల కోరిక మేరకు గవర్నర్ మళ్లీ ఆ గేయాన్ని చదవి, జై భారత్, జై తెలంగాణ నినాదంతో తన ప్రసంగాన్ని ముగించారు. అనంతరం గవర్నర్కు చైర్మన్, స్పీకర్, సీఎం వీడ్కోలు పలికారు.
గవర్నర్ ప్రసంగానికి నేడు ధన్యవాద తీర్మానం
తెలంగాణ శాసనసభ, మండలి సమావేశాలు శనివారం కూడా జరుగనున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభంకానున్నాయి. శుక్రవారం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై సౌందరరాజన్ చేసిన ప్రసంగానికి శనివారం శాసనసభలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. అసెంబ్లీలో సభానాయకుడు రేవంత్రెడ్డి, ప్రతిపక్షాల నుంచి కే తారకరామారావు, తలసాని శ్రీనివాస్యాదవ్తోపాటు విపక్ష పార్టీల సభ్యులు మాట్లాడుతారు. శాసనమండలిలోనూ అధికార, విపక్ష సభ్యులు ధన్యవాద తీర్మానంపై మాట్లాడుతారు. అనంతరం స్పీకర్ నేతృత్వంలో సభను ఎన్నిరోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకుంటారు.