హైదరాబాద్: ఆసియాలో అతిపెద్ద లైఫ్-సైన్సెస్, హెల్త్కేర్ ఫోరం అయిన బయో ఏషియా సదస్సు-2022 (BioAsia) హైదరాబాద్ వేదికగా జరుగనున్నది. వర్చువల్ పద్ధతిలో రెండు రోజులపాటు సాగే ఈ సదస్సును మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సదస్సులో బిల్గేట్స్, డబ్ల్యూహెచ్ఓ శాస్త్రవేత్త సౌమ్య స్వామినాథన్, నీటి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ సహా వివిధ సంస్థలకు చెందిన దాదాపు 50 మంది ప్రముఖులు వివిధ అంశాలపై ప్రసంగించనున్నారు.
మొదటి రోజైన గురువారం.. సాంకేతికత ద్వారా ఆరోగ్య పరిశ్రమలను బలోపేతం చేయడం, కొవిడ్ వ్యాక్సిన్ అభివృద్ధి, హెల్త్కేర్ డెలివరీ సిస్టమ్ను క్రమబద్ధీకరించడంపై తొలిరోజు జరిగే చర్చల్లో మంత్రి కేటీఆర్తోపాటు బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ కో-చైర్మన్ బిల్గేట్స్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన శాస్త్రవేత్త సౌమ్యా స్వామినాథన్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, యూరోపియన్ యూనియన్ ప్రధాన శాస్త్ర సలహాదారు (ఎపిడమిక్స్) డాక్టర్ పీటర్ పియోట్, భారత్ బయోటెక్ సీఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, బయాలాజికల్ ఈ ఎండీ మహిమా దాట్ల, కేంద్ర బయో టెక్నాలజీ విభాగం కార్యదర్శి డాక్టర్ రాజేశ్ ఎస్ గోఖలే తదితరులు పాల్గొంటారు.
రెండో రోజైన శుక్రవారం.. ఫార్మా రంగం వృద్ధి, ఆ రంగం నుంచి అవకాశాలపై చర్చ జరుగనుంది. ఇందులో బయోకాన్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబోరేటరిస్, జైడస్ క్యాడిలా, సీరమ్స్ భాగం కానున్నాయి.