223 పునరావాస శిబిరాల్లో ఏర్పాట్లు.. సీఎస్ సోమేశ్కుమార్ వెల్లడి
హైదరాబాద్ జూలై 14(నమస్తే తెలంగాణ): రాష్ట్ర వ్యాప్తంగా వరదల్లో చిక్కుకున్న 19,071 మందిని సురక్షిత ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన 223 శిబిరాలకు తరలించామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ తెలిపారు. గురువారం బీఆర్కే భవన్లో భారీ వర్షాలు, సహాయ పునరావాస కార్యక్రమాలపై విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జాతో కలిసి సచివాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ అధికారులతో సీఎస్.. సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వారం రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో వచ్చిన వరదలకు భారీ నష్టం జరుగలేదని, పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని తెలిపారు.
గోదావరికి విపరీతమైన వరద వస్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లోని జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించామని చెప్పారు. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న ములుగు, జయశంకర్ భూపాలపల్లి, భద్రాచలం జిల్లాల్లో మరింత అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు. ఇప్పటివరకు వరదల్లో చికుకున్న వందల మందిని కాపాడామన్నారు. జాతీయ విపత్తుల ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) బృందాల ద్వారా 16 మందిని, వైమానిక దళం ద్వారా ఇద్దరిని రక్షించామని తెలిపారు. రాష్ట్రంలో 223 ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి 19,071 మందికి పునరావాసం కల్పించామన్నారు. భద్రాచలం జిల్లాలో 43 శిబిరాల్లో 6,318 మంది, ములుగులో 33 శిబిరాల్లో 4,049 మంది, జయశంకర్ భూపాలపల్లిలో 20 క్యాంప్ల్లో 1,226 మందికి ఆశ్రయం కల్పించామని సీఎస్ వివరించారు.
ములుగు జిల్లా ఏటూరునాగారం పునరావాస కేంద్రంలో భోజనాలు చేస్తున్న వరద బాధితులు