హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అగ్నిమాపకశాఖకు రావాల్సిన రూ.190 కోట్ల నిధులు, వాటి ఖర్చులకు సంబంధించిన ప్రతిపాదనలను కేంద్ర హోం శాఖకు పంపినట్టు ఫైర్ డీజీ వై నాగిరెడ్డి గురువారం తెలిపారు. 2020-25 సంబంధించిన 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.190.14 కోట్లను కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది. ఈ మేరకు మనతోపాటు ఆయా రాష్ర్టాలకు చెందిన అగ్నిమాపక విభాగాలను కేంద్ర ప్రతిపాదనలు పంపాలని కోరడంతో తెలంగాణ అగ్నిమాపక శాఖ డీజీ వై నాగిరెడ్డి వెంటనే ప్రతిపాదనలు పంపారు. ఈ క్రమంలో ప్రభుత్వం రాష్ట్రవాటాగా 47.53 కోట్లను విడుదల చేయడంతో మిగిలిన 142.61 కోట్లను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్టు ఆయన చెప్పారు. ఈ మేరకు గత డిసెంబర్ 14న ఢిల్లీలోని కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి హాజరైనట్టు తెలిపారు. 2023-24లో రూ. 73.41 కోట్లు, 2024-25లో రూ.66.56 కోట్లు, 2025-26లో రూ.50.17 కోట్లు విడుదలయ్యే అవకాశం ఉందని ఫైర్ డీజీ వెల్లడించారు. మొదటి ఇన్స్టాల్మెంట్లో వచ్చే 73.41 కోట్లను 40 కోట్ల ఖర్చయ్యే 104 మీటర్ల హైడ్రాలిక్ వాహనంతోపాటు ఇతర ఆధునిక వాహనాలను కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు.