హైదరాబాద్, ఆగస్టు16 (నమస్తే తెలంగాణ): ఈ నెల 19 నుంచి మైనార్టీలకు రూ.లక్ష ఆర్థిక సాయం చెక్కుల పంపిణీని ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మైనార్టీల్లోని చిరు వ్యాపారులకు ప్రభుత్వం నూరు శాతం సబ్సిడీతో ఈ సాయం అందించనున్నది. ఇప్పటికే 2.16 లక్షల మందికి పైగా దరఖాస్తులు చేసుకొన్నారు. జనాభా నిష్పత్తి ప్రాతిపదికన జిల్లాల వారీగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. వారిలో తొలివిడతగా 10 వేల మందికి లక్ష చొప్పున ఇవ్వనున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సబ్సిడీ రుణాల కోసం పలువురు దరఖాస్తు సమర్పించారు.
అర్హులను గుర్తించి, లక్కీ డ్రా పద్ధతిలో 1,000 మంది లబ్ధిదారులను మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎంపిక చేసినా, నిధులను విడుదల చేయలేదు. ప్రస్తుతం ఆ లబ్ధిదారులకు కూడా రూ.లక్ష ఆర్థిక సాయాన్ని పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాష్ట్రంలో 11 వేల మంది మైనార్టీలకు ఈ సాయం అందనున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4,500 మందికి, మిగతా జిల్లాల్లో 6,500 మందికి లక్ష చొప్పున చెక్కులు ఇవ్వనున్నారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా రూ.లక్ష సాయం చెక్కుల పంపిణీకి మంత్రులు శ్రీకారం చుట్టనున్నారు. దీనికోసం మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాల్లో కూడా త్వరలో చెక్కుల పంపిణీ చేపట్టనున్నట్టు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇంతియాజ్ ఇషాక్ వెల్లడించారు.