నెక్కొండ, మార్చి 4 : అంతర్జాతీయ యోగా కేంద్రానికి వరంగల్ జిల్లా నెక్కొండలోని కొలను శ్రీవెంకటేశ్వర స్వామి ట్రస్టు, ఎర్రబెల్లి ట్రస్టు తరపున 180 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్టు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. ఈ మేరకు భూమి పత్రాలు, మ్యాప్లను శ్రీరామచంద్ర మిషన్కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ యోగా గురువు కమలేష్ డి పటేల్ దాజీకి మంత్రి శనివారం అందజేశారు. అంతకుముందు మంత్రి ఆ భూమిని స్వయంగా దాజీకి దగ్గరుండి చూపించారు. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న భూమిని ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా ఇవ్వడం చాలా సంతోషంగా ఉన్నదని ఎర్రబెల్లి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీరామచంద్ర మిషన్ను తెలంగాణలోనూ విస్తరించాలన్న ఆలోచనకు మంత్రి ఎర్రబెల్లి ఒక రూపం ఇచ్చారని దాజీ కొనియాడారు.