హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కిడ్నీ వ్యాధిగ్రస్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నదని, ఏటా సుమారు 5 లక్షల మంది డయాలసిస్ రోగులుగా మారుతున్నారని పద్మభూషణ్, ప్రముఖ నెఫ్రాలజిస్టు డాక్టర్ ఎంకే మణి అన్నారు. అంతర్జాతీయ కిడ్నీ డే (వాస్తవానికి మే 9) ముందస్తు కార్యక్రమం శనివారం హైదరాబాద్ యశోద దవాఖానలో జరిగింది. ఈ సందర్భంగా 50 మందికిపైగా కిడ్నీ దాతలను ఘనంగా సత్కరించారు. డాక్టర్ ఎంకే మణి మాట్లాడుతూ దేశ జనాభాలో 17% మందికి దీర్ఘకాలిక కిడ్నీ సమస్యలు ఉన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలు ఈ వ్యాధి బారిన పడ్డాయని పేర్కొన్నారు. యశోద హాస్పిటల్స్ కిడ్నీట్రాన్స్ప్లాంటేషన్ నిపుణుడు డాక్టర్ రాజశేఖర్ చక్రవర్తి మాట్లాడుతూ కిడ్నీ వ్యాధుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. డయాబెటిస్, హైబీపీతో బాధపడుతున్న వారు కిడ్నీల విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాథమిక దశలో ప్రమాదకర వ్యాధులను గుర్తించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జాకబ్ వర్గీస్, యశోద హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి, నెఫ్రాలజిస్టులు, కిడ్నీ మార్పిడి నిపుణులు పాల్గొన్నారు.