Telangana | హైదరాబాద్, జూలై 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో మొదటిదశలో చేపట్టిన సమీకృత కలెక్టరేట్ భవనాల్లో చివరి మూడు భవనాల నిర్మాణం పూర్తయింది. ఈ నెలాఖరులో రెండు, వచ్చే నెల రెండో వారంలో మరో భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ మూడు భవనాలు ప్రారంభమైతే తొలిదశలో చేపట్టిన మొత్తం 25 కలెక్టరేట్ల నిర్మాణం పూర్తయినట్టవుతుంది. రెండో దశలో చేపట్టిన ఐదు కలెక్టరేట్లలో మూడింటి నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నది. జిల్లాస్థాయిలో పాలనా సౌలభ్యం, ప్రజల వెసులుబాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,649.62 కోట్లతో రెండు దశల్లో 30 జిల్లాల్లో సమీకృత కలెక్టరేట్ (ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్సెస్, ఐడీవోసీ)ల నిర్మాణం చేపట్టింది. మొదటి దశలో చేపట్టిన 25 భవనాల్లో ఇప్పటికే 22 భవనాలను ప్రారంభించారు. మిగిలిన మూడింట్లో మెదక్, సూర్యాపేట కలెక్టరేట్లు ప్రారంభానికి సిద్ధమయ్యా యి. వీటిని ఈ నెలాఖరులోగా ప్రారంభించాలని నిర్ణయించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ నిర్మాణం పూర్తికాగా, తుది మెరుగులు దిద్దుతున్నారు. దీన్ని వచ్చే రెండో వారంలో ప్రారంభించాలని నిశ్చయించారు.
శరవేగంగా మరో ఐదు కలెక్టరేట్లు
రెండోదశలో కరీంనగర్, నారాయణపేట, ములుగు, ఆదిలాబాద్, వరంగల్లో (ఐదు) జిల్లాల కలెక్టర్ల నిర్మాణం చేపట్టారు. ఇందులో కరీంనగర్ కలెక్టరేట్ నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నారాయణపేట, ములుగు కలెక్టరేట్లను వచ్చే ఏడాది మార్చి నాటికి సిద్ధం చేయాలని నిర్ణయించారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ నిర్మాణం పనులను ఇటీవలే ప్రారంభించారు. వరంగల్ కలెక్టరేట్ నిర్మాణానికి ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తయింది.
శరవేగంగా అధికారుల క్వార్టర్ల నిర్మాణం
సమీకృత కలెక్టరేట్ల ప్రాంగణంలోనే జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్తోపాటు జిల్లాస్థాయి అధికారుల కోసం క్వార్టర్ల నిర్మాణం కూడా చేపట్టారు. తొలిదశలో 20 క్వార్టర్ల నిర్మాణం చేపట్టగా, 14 ఇప్పటికే పూర్తయ్యాయి. నిర్మాణం పూర్తయినవాటిలో సిద్దిపేట, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జనగామ, యాదాద్రి భువనగిరి, వనపర్తి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, పెద్దపల్లి, జగిత్యా ల, భద్రాద్రి కొత్తగూడెం, జోగులాంబ గద్వాల, నాగర్కర్నూల్, మెదక్ జిల్లాలున్నాయి. మహబూబాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, సూర్యాపేట, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్ జిల్లా ల్లో క్వార్టర్ల నిర్మాణం శరవేగంగా కొనసాగుతున్నది. రెండోదశలో హనుమకొండ, నిజామాబాద్, ములుగు, నారాయణపేట, వరంగల్ జిల్లాల్లో క్వార్టర్ల నిర్మాణం చేపట్టగా, వరంగల్ మినహా నాలుగు జిల్లాల క్వార్టర్ల నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి.