హైదరాబాద్, డిసెంబర్10 (నమస్తే తెలంగాణ): రజకులు, నాయీ బ్రాహ్మణులకు కల్పిస్తున్న ఉచిత విద్యుత్తు పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రూ.16.37 కోట్లను విడుదల చేసింది. ఈ మేరకు రజక సంఘాల సమితి రాష్ట్ర చీఫ్ అడ్వైజర్, ఎంబీసీ రాష్ట్ర కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. దోబీఘాట్లు, సెలూన్లకు తెలంగాణ ప్రభుత్వం 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తున్నదని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన నిధులను రజక ఫెడరేషన్, నాయీబ్రాహ్మణ ఫెడరేషన్ల ద్వారా ఆయా విద్యుత్తు డిస్కంలకు విడుదల చేసిందని తెలిపారు. ఇటీవలే ఉచిత్ విద్యుత్తుకు సంబంధించి సర్కారు మొదటి దఫాగా రూ.12.88 కోట్లను మంజూరు చేసిందని పేర్కొన్నారు. రెండో దఫా కింద రూ.16.37 కోట్లను విడుదల చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. నిధులను విడుదల చేసిన ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్కు తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, ముఖ్య సలహాదారు, ఎంబీసీ కో కన్వీనర్ కొండూరు సత్యనారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.