సిద్దిపేట అర్బన్, ఫిబ్రవరి 15: రాష్ట్రంలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు, హాస్టల్ విద్యార్థుల మెస్చార్జీలను త్వరలోనే పెంచుతామని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు భరోసా ఇచ్చారు. బుధవారం ఆయన సిద్దిపేటలో బస్తీ దవాఖానతోపాటు కేసీఆర్నగర్లో మహాత్మా జ్యోతిభాఫూలే బీసీ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలను ప్రారంభించారు. శ్రీసంత్ సేవాలాల్ మహరాజ్ 284 జయంతి సందర్భంగా క్యాంపు కార్యాలయంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో హరీశ్రావు మాట్లాడుతూ.. విద్యార్థులకు మంచి విద్యతోపాటు మంచి భోజనం అందాలన్న ఉద్దేశంతోనే మెస్చార్జీలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత బీసీ రెసిడెన్షయల్ పాఠశాలల సంఖ్య 19 నుంచి 294కు పెంచామని వివరించారు. బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 8 వేల నుంచి 1,65,000కు పెరిగిందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని రకాల గురుకుల పాఠశాలల సంఖ్య ఉమ్మడి రాష్ట్రంలో 298 ఉంటే నేడు 1004కు చేరిందని తెలిపారు. వాటిలో చదివే విద్యార్థుల సంఖ్య 1.40 లక్షల నుంచి 5.50 లక్షలకు పెరిగిందని వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో గురుకుల పాఠశాలలకు బడ్జెట్లో రూ.370 కోట్లు కేటాయిస్తే.. నేడు రూ.3,800 కోట్లు కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఎస్సీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల మాదిరిగా విదేశాల్లో ఉన్నత విద్య, మెడిసిన్, ఇంజినీరింగ్, ఐఐటీ, ఎయిమ్స్ లాంటి ఉన్నత విద్యాసంస్థల్లో చేరేలా బీసీ రెసిడెన్షియల్ విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వాలని సూచించారు.
ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం గురుకులాలు 298
నేడు మొత్తం గురుకులాలు 1,004
నాడు గురుకుల విద్యార్థుల సంఖ్య 1.40 లక్షలు
నేడు గురుకుల విద్యార్థుల సంఖ్య 5.50 లక్షలు
నాడు గురుకుల పాఠశాలల బడ్జెట్ 370 కోట్లు
నేడు గురుకుల పాఠశాలల బడ్జెట్ 3,800 కోట్లు
హైదరాబాద్లో విజయవంతమైన బస్తీ దవాఖానలను రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, పట్టణాలకు విస్తరింపజేస్తామని మంత్రి హరీశ్రావు తెలిపారు. హైదరాబాద్లోని 350 బస్తీ దవాఖానల ద్వారా ఇప్పటివరకు 2 కోట్ల మందికి వైద్య పరీక్షలు నిర్వహించామని వెల్లడించారు. బస్తీ దవాఖానల్లో 133 రకాల టెస్ట్టులు చేస్తారని, ఆదివారం సైతం సేవలు లభిస్తాయని తెలిపారు.
గర్భం దాల్చిన నాటి నుంచి కాన్పు వరకు గర్భిణులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ సమయంలో ఏ మందులు వేసుకోవాలి? తదితర జాగ్రత్తలను వివరిస్తూ వైద్యారోగ్యశాఖ లేఖలు రాస్తున్నది. ఈ కార్యక్రమాన్ని మంత్రి హరీశ్రావు జిల్లా అధికారులతో కలిసి సిద్దిపేటలో శ్రీకారం చుట్టారు.
గిరిజనుల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ దేశం గర్వించదగ్గ గొప్ప ఆధ్యాత్మికవేత్త, సంఘ సేవకుడు అని మంత్రి హరీశ్రావు కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత సంత్ సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని చెప్పారు. ఇప్పటికే గిరిజన సంక్షేమశాఖలో 1,650 పోస్టుల భర్తీకి అనుమతిచ్చినట్టు తెలిపారు. 1,287 తండాలు, గూడాలకు రహదారి సౌకర్యం కల్పించేందుకు 2,500 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి రూ.1,385 కోట్లు మంజూరు చేసినట్టు వెల్లడించారు. సమ్మక్క, సారలమ్మ జాతరకు ఇప్పటివరకు రూ.354 కోట్లు ఖర్చు చేసినట్టు వివరించారు. పోడు భూములకు పట్టాలు నెల రోజుల్లో అందజేస్తామని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేపడుతుంటే, కాంగ్రెస్ పార్టీ మాత్రం గిరిజనులను మోసం చేసి వారిని ఓటు బ్యాంకుగా మాత్రమే వాడుకున్నదని విమర్శించారు.