హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): తలసరి ఆదాయంలో రాష్ట్రం తాజాగా మరోసారి సత్తా చాటింది. గత ఆర్థిక సంవత్సరం (2022-23)లో తెలంగాణ రూ.3,08,732 (ప్రస్తుత ధరల ప్రకారం) ‘తలసిరి’తో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్టు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ వెల్లడించింది. ఇది 2014-15లో రూ.1,24,104గా నమోదైన దానికంటే దాదాపు 150% అధికం. ఇదే సమయంలో తెలంగాణ తలసరి ఆదాయ వృద్ధిరేటు 11 నుంచి 15.1 శాతానికి పెరిగింది. 2021-22లో తెలంగాణ
రూ.2,65,942 ‘తలసిరి’తో పెద్ద రాష్ర్టాల జాబితాలో మొదటి స్థానంలో నిలిచిన విషయం విదితమే.
దీనితో పోలిస్తే 2022-23లో రాష్ట్ర తలసరి ఆదాయం భారీగా పెరిగిందని చెప్పవచ్చు. 2020-21, 2021-22లో ఢిల్లీ తలసరి ఆదాయం వరుసగా రూ.3,31,112, రూ.3,89,529గా నమోదైంది. కానీ, 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఢిల్లీ తలసరి ఆదాయ వివరాలు అందుబాటులో లేవు. దీంతో ఈసారి తెలంగాణ తర్వాత కర్ణాటక రూ.3,01,673, హర్యానా రూ.2,96,685 ‘తలసిరి’తో వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచినట్టు స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ శాఖ తెలిపింది.
స్థూల విలువ జోడింపు (జీవీఏ)లో ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, ప్రొఫెషనల్ సర్వీసెస్ రంగాలు అత్యధికంగా రాణించాయి. వాస్తవానికి 2021-22 ఆర్థిక సంవత్సరంలో నమోదైన మొత్తం జీఏవీలో 21.51 శాతంగా ఉన్న ఈ రంగాల వాటా గత ఆర్థిక సంవత్సరంలో 21.42 శాతానికి తగ్గింది. గత ఐదేండ్లుగా ఈ రంగాలు జీవీఏలో అత్యధికంగా 22.19% వాటాను కలిగివుండడం గమనార్హం.