హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలను అందించేందుకు మహిళా సంఘాల ద్వారా బ్యాంకు సఖులను ఏర్పాటు చేస్తున్నట్టు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. వీటి ద్వారా గ్రామీణ ప్రజలు ఆర్ధిక సేవలతోపాటు ఆధార్ నమోదు, ప్రభుత్వ పథకాల్లో పేర్లు నమోదు చేసుకోవడం, బిల్లుల చెల్లింపు, ప్రయాణ టికెట్లు రిజర్వు చేసుకోవడం, శాశ్వత ఖాతా సంఖ్య (పాన్), కొత్త ఎల్పీజీ కనెక్షన్ కోసం దరఖాస్తులు, గ్యాస్ సిలిండర్ బుకింగ్ తదితర సేవలను పొందవచ్చని చెప్పారు. గురువారం ఆయన ఖైరతాబాద్లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ భవనంలో బ్యాంకు సఖులకు 424 బయోమెట్రిక్ పరికరాలను పంపిణీ చేసి, డివైజ్ పోస్టర్ను ఆవిషరించారు. అనంతరం మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ఒక్కో బ్యాంక్ సఖికి 4-5 గ్రామాలను అనుసంధానించనున్నట్టు తెలిపారు. దీని ద్వారా నిరుపేద నిరుద్యోగ మహిళలకు చకటి జీవనోపాధి లభిస్తుందని, మొదట్లో నెలకు రూ.5-10 వేలు, రెండు మూడేండ్ల తర్వాత రూ.20-25 వేలు సంపాదించుకొనే వెసులుబాటు కలుగుతుందన్నారు.
ఆ మూర్ఖులకు రాష్ర్టాభివృద్ధి కనిపించడంలేదా?
రాష్ట్రంలో ఏమి అభివృద్ధి జరిగిందని కొందరు మూర్ఖులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి ధ్వజమెత్తారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి ఆ మూర్ఖులకు కనిపించడంలేదా? అని ప్రశ్నించారు. కల్యాణలక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల విద్యుత్తు, మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లా నీరు, గ్రామాల్లో వైకుంఠధామాలు, డంపింగ్ షెడ్ల నిర్మాణం, పెద్ద ఎత్తున మొక్కల పెంపకంతో గ్రామాలను పచ్చగా, పరిశుభ్రంగా తీర్చిదిద్దడం అభివృద్ధి కాదా? అని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రంలో మహిళా సంఘాలకు రూ.2-3 వేల కోట్ల రుణాలు మాత్రమే ఇచ్చేవారని, ఇప్పుడు సీఎం కేసీఆర్ ఆదేశాలకు అనుగుణంగా తెలంగాణలో రూ.15 వేల కోట్ల రుణాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలకు బ్యాంకింగ్ సేవలు అంతగా విస్తరించలేదని, అందుకే మహిళా స్వయం సంఘాలకు శిక్షణ ఇచ్చి, బ్యాంకు సఖులను ఏర్పాటు చేస్తున్నామని పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా తెలిపారు. గత ఏడాది 70 వేల మంది చిన్న వ్యాపారులకు రూ.545 కోట్ల రుణాలను అందించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 1.30 లక్షల మందికి రుణాలు ఇప్పిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో నాబార్డు జీఎం సెల్వం, ఎస్బీఐ డీజీఎం నటరాజన్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ రాజ్కిశోర్, సెర్ప్ బ్యాంకు లింకేజీ డైరెక్టర్ వై నర్సింహరెడ్డి, వివిధ బ్యాంకుల ప్రతినిధులు, అధికారులు, రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన బ్యాంకింగ్ సఖీలు పాల్గొన్నారు.