చందుర్తి, ఫిబ్రవరి 23: తక్కువ ధరకు బంగారం వస్తున్నదన్న ఆశతో ఆంధ్రాకు వెళ్లి ముగ్గురు వ్యక్తులు మోసపోయిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలం లింగంపేటలో ఆలస్యంగా వెలుగుచూసింది. స్థానికుల కథనం ప్రకారం.. లింగంపేటకు చెందిన సుధీర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి కొద్దిరోజుల కిందట అనంతపురం జిల్లా కనగానపల్లి మండలం గోరంట్లకు చెందిన నవీన్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వీరిద్దరూ తరచూ ఫోన్లో మాట్లాడుకొనేవారు. ఈ నెల 16న నవీన్.. సుధీర్కు ఫోన్ చేశాడు. తన వద్ద బంగారం పూసలున్నాయని, వాటిని తక్కువ ధరకు విక్రయించాలని అనుకుంటున్నట్టు నమ్మబలికాడు. ధర తక్కువ అని చెప్పడంతో తానే కొనుగోలు చేస్తానని, ఎవరికీ అమ్మవద్దని సుధీర్ బదులిచ్చాడు. అయితే ఈ నెల 18న అనంతపురం జిల్లా మామిళ్లపల్లి చౌరస్తాకు రావాలని సూచించాడు. అనుకున్న ప్రకారమే సుధీర్ తన స్నేహితులైన శేఖర్, ఆనంద్తో కలిసి అనంతపురం వెళ్లాడు. ముందుగా నవీన్ నాలుగు బంగారు పూసలు ఇచ్చి మేలిమి బంగారం అవునో కాదో పరీక్షించుకోవాలని సూచించాడు. అవి అసలు గోల్డేనని నిర్ధారించుకొన్న తర్వాత మిగతా బంగారాన్ని రూ.15 లక్షలకు కొనుగోలు చేశారు. తిరిగి వస్తున్న క్రమంలో సంచి విప్పి చూడగా అందులో నకిలీ పూసలు కనిపించడంతో కంగు తిన్నారు. వెంటనే అక్కడికి చేరుకొని గోరంట్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూడటంతో స్థానికంగా చర్చనీయాంశమైంది.