హైదరాబాద్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో రోజు రోజుకూ విద్యుత్తు డిమాండ్ భారీగా పెరుగుతున్నది. తెలంగాణ చరిత్రలోనే అత్యధికంగా విద్యుత్తు డిమాండ్ శనివారం ఏర్పడింది. శనివారం మధ్యాహ్నం 12.32 గంటలకు ఇంత వరకు ఎన్నడూ లేనంతగా గరిష్ఠ డిమాండ్ 14,649 మెగావాట్లకు చేరింది. అయినా రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి అంతరాయం కలగకుండా విద్యుత్తును సరఫరా చేశారు. నిజానికి ఇంత భారీ డిమాండ్ అనేది మార్చి, ఏప్రిల్ నెలల్లో వస్తుంటుంది. ఆ సమయంలో వరి పంటకు నీటి అవసరాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే రైతులు మోటర్లను వాడుతుంటారు. అయితే ఈ ఏడు యాసంగి నాట్లు కొంత తొందరంగా వేయడంతో ఇంత డిమాండ్ ఫిబ్రవరి రెండో వారంలోనే వచ్చిందని విద్యుత్తు శాఖాధికారులు అంచనా వేస్తున్నారు. రెండు రోజుల క్రితమే 14,169 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ రికార్డు నమోదైంది. ఇది నిరుడు మార్చి 24న వచ్చిన 14,160 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ రికార్డును ఇది తుడిపేసింది. శనివారం నాటి డిమాండ్, రెండు రోజుల క్రితం వచ్చిన 14,169 మెగావాట్ల రికార్డును కూడా తుడిచిపెట్టింది. ఈ నెలలోనే 15 వేల మెగావాట్ల వరకు డిమాండ్ వచ్చే అవకాశం ఉన్నదని, ఏప్రిల్ 20 నుంచి డిమాండ్ తగ్గవచ్చని అధికారులు అంచనా వేశారు.
16 వేల మెగావాట్లకు సైతం సిద్ధం
ఈసారి వరి నాట్లు తొందరగా పడటంతో గరిష్ఠ డిమాండ్ ఫిబ్రవరి రెండో వారంలోనే వచ్చింది. ఈ నెలాఖరుకల్లా 15 వేల మెగావాట్ల వరకు వస్తుందని అంచనా వేశాం. మార్చి చివరికల్లా సుమారు 16 వేల మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. అయినా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తును సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఏప్రిల్ మూడో వారానికల్లా ఈ డిమాండ్ తగ్గుతుంది. నిజానికి ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలను 18 వేల మెగావాట్లు వచ్చినా తట్టుకునేలా వేలాది కోట్లు ఖర్చుచేసి బలోపేతం చేశాం. సాంకేతికపరమైన ఎలాంటి సమస్యలు తలెత్తినా, వెంటనే చర్యలు తీసుకుని ప్రజలకు విద్యుత్తు సరఫరాలో ఇబ్బందులు తొలగించేలా విద్యుత్తు యంత్రాంగం మొత్తం సన్నద్ధంగా ఉన్నది.
– దేవులపల్లి ప్రభాకర్రావు, ట్రాన్స్కో, జెన్కో సీఎండీ